Etela Rajender: స్వేచ్ఛ బ్యూరో: దేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, సభలో ప్రజా సమస్యలపై చర్చించకుండా వీధుల్లో ధర్నాలు చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రజాస్వామ్య వ్యవస్థను తీవ్రంగా అపహాస్యం చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.
కాంగ్రస్ ప్రభుత్వంపై ఈటల ఫైర్..
ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి పార్లమెంట్ వేదికగా ప్రజల గొంతుక కావాలని, సమస్యలను సభ దృష్టికి తెచ్చి పరిష్కారాలు సాధించాల్సింది పోయి.. తన బాధ్యతను విస్మరించి రోడ్లపై కూర్చొని ధర్నాలు చేయడం అత్యంత విచారకరమని చురకలంటించారు. ఒకవైపు సభ నడవకుండా ఆటంకాలు సృష్టిస్తూ పార్లమెంట్ సమయాన్ని వృథా చేయడం, మరోవైపు ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నాలకు దిగడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఫైరయ్యారు.
ఇప్పటికైనా నిరసనలు ఆపండి..
కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లాలనే కుట్రపూరిత ఆలోచనతోనే రాహుల్, ప్రియాంక ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పార్లమెంట్లో నిలదీసి చర్చించేవారన్నారు. సభలో మాట్లాడే ధైర్యం, తగిన ఆధారాలు లేకే వీరు రోడ్లపైకి వచ్చి ఈ రకమైన నాటకాలకు తెరలేపారని ఈటల మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న ఈ రాజకీయ డ్రామాలను తక్షణమే స్వస్తి పలకాలని, ఇప్పటికైనా నిరసనలు ఆపి, ప్రజాహితం కోసం పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఈటల సూచించారు.
రాహుల్, ప్రియాంక గాంధీపై ఫైర్..
ఇదిలాఉండగా కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ చేస్తున్న ధర్నాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కావని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలను వదిలేసి వీధుల్లో రచ్చ చేయడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని చురకలంటించారు. ప్రధాని మోడీ నివాసం ముట్టడి పేరుతో రాహుల్ గాంధీ చౌకబారు విన్యాసాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల వైఫల్యంపై ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని తట్టుకోలేక, దృష్టి మళ్లించడానికే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఢిల్లీ నాటకాల్లో భాగస్వామి అవుతోందని ఆయన ఫైరయ్యారు.
Also Read: రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్.. ‘దేశ సమగ్రతను దెబ్బతీస్తే తీహార్ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే!’