BJP Attack: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొద్ది రోజుల్లో సీనియర్ సిటిజన్ అవుతారని, ఆయన ఇప్పటికైనా పరిణితి చెందిన నేతగా వ్యవహరించాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 65 ఏళ్లు దేశాన్ని పాలించిన రాజ కుటుంబీకులు రాహుల్, ప్రియాంక గాంధీ అని, ఒక చాయ్ వాలా పాలించడాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలంతా తీహార్ జైల్లో ఉంటారు..?
నీట్ లో తప్పులు జరిగాయని, కాంగ్రెస్ హయాంలోనూ జరిగాయన్నారు. అయితే.. గతంలోలాగా తాము ఆలస్యం చేయలేదని, మళ్లీ పీఎంవో నుంచి పూర్తి పర్యవేక్షణ చేపట్టి రీ ఎగ్జామ్ నిర్వహించినట్లు చెప్పారు. ఢిల్లీ ధర్నాలో నీట్ కు సంబంధం లేని వాళ్లు ఉన్నారని, ఆ వీడియోలు బయటపెడితే కాంగ్రెస్ నేతలంతా తీహార్ జైల్లో ఉంటారని ఫైరయ్యారు. టుక్ డే.. టుక్ డే గ్యాంగ్ కు భయపడే వాళ్ళం తాము కాదన్నారు. హిందూధర్మంపై మాట్లాడటానికి ప్రకాష్ రాజ్ ఎవరని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు.
దేశాన్ని ముక్కలు కానివ్వబోం.. రాకేశ్ రెడ్డి
నీట్ కోసం ధర్నా చేస్తే హిందూత్వంపై, రాముడిపై విమర్శలు, పార్లమెంట్ పై దాడులు చేస్తామనడం ఏంటని నిలదీశారు. భారత సమగ్రతను దెబ్బతీసేందుకు దేశ వ్యతిరేకులు, విదేశీ శక్తులు చేస్తున్న కుట్రగా ఆయన పరిగణించారు. దేశ సమగ్రత దెబ్బతీయాలని చూసే వాళ్లను అల్లా ఆశీస్సులతో వారి భాషలోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. దేశ సమగ్రత దెబ్బతీయాలని చూసే వాళ్లు తీహార్ జైల్లో ఊచలు లెక్కపెట్టడం ఖాయమన్నారు. యువత ఇలాంటి దేశ వ్యతిరేకుల మాటలు నమ్మి రోడ్లపైకి రావద్దని ఆయ సూచించారు. దేశాన్ని ముక్కలు కానివ్వబోమని రాకేశ్ రెడ్డి స్పష్టంచేశారు.
పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ..
అనందరం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఇవ్వాళ చీకటి రోజని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దాడికి దిగారని, తాము శాంతియుతంగా నిరసన చేస్తే అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారన్నారు. కానీ కాంగ్రెస్ నేతలకు మాత్రం పోలీసులు గ్రీన్ చానల్ ఇచ్చి మరి దాడులకు అవకాశం కల్పించారని పాల్వాయి వెల్లడించారు. ఆయన వెంట ముష్కర మూక రాళ్ళతో దాడికి పాల్పడిందని ఆయన మండిపడ్డారు.
Also Read: ఆదిలాబాద్ CCI పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వండి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ!
పాల్వాయి డిమాండ్..
ఈ దాడిలో ప్రవీణ్ అనే జర్నలిస్టు తల పగిలిందని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు నెక్లెస్ రోడ్ నుంచి బయలుదేరి వచ్చారని, వాళ్లకు అవకాశం కల్పించిన పోలీసులు తాము ధర్నా చేస్తే మాత్రం పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఫైరయ్యారు. బల్మూరి వెంకట్, ఆయన ముష్కర మూకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాల్వాయి డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీకి స్వశక్తి సరిపోదు..
రాహుల్ గాంధీకి స్వశక్తి సరిపోదని.. భారత వ్యతిరేకుల మద్దతు కోసం రాహుల్ కొత్త వేదికను ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల ఆయన విదేశీ పర్యటనలకు రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోందని, ఆ డబ్బులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. నీట్ లో తప్పిదాలు జరిగాయని, అయితే.. తప్పుచేసిన 13 మందిని జైల్లో పెట్టారన్నారు. నీట్ తప్పిదాలపై పార్లమెంట్ లో చర్చించవచ్చని, అలా కాదని వీధి పోరాటాలతో ఈ సమస్యలు పరిష్కారం కావని పాల్వాయి హరీశ్ స్పష్టంచేశారు.
కాంగ్రెస్పై ఎన్వీ సుభాష్ ఫైర్..
కాంగ్రెస్ రాక్షస పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను తమ సొంత సైన్యంలా వాడుకుంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, ప్రశ్నించే బీజేపీ నాయకులను భయపెట్టాలని చూస్తే మేము బెదిరిపోయేది లేదన్నారు. నిరసన తెలిపే హక్కుపై ఉక్కుపాదం మోపడం కాంగ్రెస్ నిరంకుశత్వానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.
Also Read: నీట్ స్కామ్పై కేంద్రానికి కాంగ్రెస్ డెడ్లైన్.. భువనగిరి ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!