Telangana BJP: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో ఏమాత్రం పస లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో అప్పుల విషయం ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీల అమలు ప్రస్తావనే గవర్నర్ ప్రసంగంలో లేదని మండిపడ్డారు.
గవర్నర్ ప్రసంగం చూస్తే పేదవాడికి భరోసా ఇచ్చేలా లేదని పేర్కొన్నారు. బీఏసీ సమావేశంలో మంత్రి అనాలోచిత నిర్ణయం స్పష్టమైందని మండిపడ్డారు. సమస్యల నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం సమావేశాలను తక్కువ రోజుల్లోనే ముగించాలని చూస్తోందన్నారు. కనీసం 30 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరామని, కానీ.. ఐదారు రోజులు బడ్జెట్ పై చర్చ పెట్టి.. ఆమోదం తెలుపుకోవాలని చూస్తోందన్నారు. ప్రభుత్వం సమస్యలపై చర్చించకుండా తప్పించుకుంటోందన్నారు. లెక్కకు మించిన అప్పు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఏలేటి ఫైరయ్యారు.
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. ఆరు గ్యారంటీలపై ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై ఊసే ఎత్తలేదన్నారు. ప్రజా సమస్యలు, ఆరు గ్యారంటీలు, రైతుల కష్టాలపై నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని శంకర్ వ్యాఖ్యానించారు. వందేమాతరం గేయాన్పి ఆలపించకుండా ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడం దారుణమని, రాజ్యాంగాన్ని, దేశాన్ని అవమానించారని ఘాటుగా విమర్శించారు. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: SRH Captain: కావ్య పాప మరో వివాదస్పద నిర్ణయం..SRHకు కొత్త కెప్టెన్ ను నియమిస్తూ ప్రకటన!