Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: బీజేపీకి ఏ పార్టీతో పొత్తు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకల్ పరిస్థితులను బట్టి అక్కడ పొత్తులు పెట్టుకొని ఉండొచ్చని అన్నారు. కచ్చితంగా అలాంటి వారిపై రివ్యూ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఎప్పుడైనా రాజకీయ సమీకరణలు మారొచ్చని, నిజామాబాద్ ఒక్కటే కాదు మిగతా వాటిలో కూడా టర్మ్ పూర్తి కాకుండానే కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పారు. భైంసా కూడా మొదటిసారి బీజేపీ ఖాతాలో పడిందని, భైంసా సంచలనమైన కేంద్రమని అన్నారు. తమ కార్యకర్తలను వేధించి, జైలుకు పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. వారిలో చాలామందిని తాను లాయర్ గా విడిపించానన్నారు. మజ్లిస్ నేతలు హిందువులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారన్నారు.
భైంసాలో బీజేపీని రానివ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. తాము 336 స్థానాల్లో గెలిచామన్నారు. 25 కంటే ఎక్కువ మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగామని, నిర్ణయాత్మకమైన శక్తిగా బీజేపీ ఎదిగిందని రాంచందర్ రావు తెలిపారు. గతంలో కంటే పోలిస్తే చాలా వార్డులు, డివిజన్లలో గెలిచామని, పరకాలలో మొదటిసారి 3 స్థానాల్లో గెలిచామని రాంచందర్ రావు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పుడు చంకలు గుద్దుకుంటున్నాయని, బీజేపీ కంటే తమకు ఎక్కువ వచ్చాయని చెప్పుకుంటున్నాయని, కానీ బీఆర్ఎస్ కు గతం కంటే చాలా తగ్గాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వారికి 500 స్థానాలు తగ్గితే బీజేపీకి 100 స్థానాలు గతంకంటే అదనంగా పెరిగాయని తెలిపారు. కాంగ్రెస్ కు గతంలో వచ్చిన సీట్లు చాలా తక్కువ అని, అప్పుడు బీజేపీకి వచ్చినన్ని సీట్లే ఇప్పుడు వారికి వచ్చాయన్నారు. రూలింగ్ పార్టీ అయి ఉండి కూడా ఆశించినన్ని స్థానాలు కాంగ్రెస్ కు రాలేదన్నారు.
Also Read: Smartphone Comparison: ఓప్పో K14x 5G vs గెలాక్సీ F70e vs రియల్మీ P3 లైట్.. కొత్త ఫోన్లలో ఏది బెస్ట్?
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ బీజేపీ మేయర్ పదవి దక్కించుకోలేదని, కానీ మొదటిసారి కరీంనగర్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేశామని రాంచందర్ రావు వివరించారు. ఈ ఘనత సాధించిన బండి సంజయ్ కి తన అభినందనలు తెలియజేశారు. నిర్మల్లో మైనార్టీ ఓటింగ్ శాతం ఎలా పెరిగిందని రాంచందర్ రావు ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారా? అని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా కొన్ని స్థానాల్లో బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలు భావించినా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్(Congress), ఎంఐఎం(MIM), బీర్ఎస్(BRS)తో పాటు ఆ పార్టీలకు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్తులను కూడా బీజేపీని రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. వారిది అక్రమ సంబంధమా? ఏ రకమైన సంబంధం అనాలో చెప్పాలన్నారు. వీటిని కట్టడి చేయాలని ఎస్ఐఆర్ ను చేపడుతున్నామని, అందరూ సహకరించాలన్నారు. నకిలీ ఓట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు తెలియకుండానే కొందరు నకిలీ ఓట్లు సృష్టిస్తున్నారని, ఆ లెక్కలు ఎస్ఐఆర్ తో తేలుతాయన్నారు. బీజేపీలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు.
Also Read: KCR birthday: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు.. ఆకట్టుకుంటున్న సైకత శిల్పం