KCR birthday: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు రాష్ట్ర సరిహద్దులు దాటి ఒడిశాలోని పూరీ తీరానికి చేరుకున్నాయి. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, శేరిలింగంపల్లికి చెందిన ఉద్యమకారుడు, భారాస సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో పూరీ సముద్ర తీరాన ఒక అద్భుతమైన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రాంతమైన పూరీలో వెలసిన ఈ కళాకృతి ప్రస్తుతం అక్కడికి వచ్చే వేలాది మంది సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సైకత శిల్పం ద్వారా కేసీఆర్ గురించి అభివర్ణిస్తూ ఒక బలమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. “హీ డిమాండ్, వీ బిలీవ్డ్, తెలంగాణ వాస్ బార్న్.. ఏ ప్రామిస్ ఫుల్ ఫిల్డ్” (ఆయన డిమాండ్ చేశారు, మేము నమ్మాము, తెలంగాణ ఆవిర్భవించింది.. ఒక వాగ్దానం నెరవేరింది) అనే నినాదంతో రూపొందించిన ఈ శిల్పం, కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని కళ్లకు కడుతోంది. కేవలం ఒక నాయకుడిగానే కాకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రధాతగా ఆయన చేసిన కృషిని ఈ వేదిక ద్వారా కొనియాడారు.
బంగారు తెలంగాణ నిర్మాతగా, జన హృదయ నేతగా కేసీఆర్కు ఉన్న గుర్తింపును ఈ సైకత శిల్పంలో అద్భుతంగా పొందుపరిచారు. ఈ సందర్భంగా చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధన నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు ప్రతి అడుగులోనూ కేసీఆర్ ముద్ర ఉందన్నారు. అరవై ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపిన ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే కేసీఆర్ అందించిన అభివృద్ధి పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని రవీందర్ యాదవ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మళ్లీ భారాస అధికారంలోకి వస్తుందని, ప్రస్తుతం జరుగుతున్న విమర్శలన్నింటికీ అభివృద్ధి ద్వారానే బదులిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కష్టకాలంలోనూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు కేసీఆర్ నాయకత్వమే కొండంత అండ అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. జడ్పీటీసీ, ఎంపీటీసీల పై సీఎం రివ్యూ త్వరలో..?
పూరీ సందర్శనకు వచ్చిన పర్యాటకులు ఈ సైకత శిల్పం వద్ద ఆగి సెల్ఫీలు తీసుకుంటూ ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని చాటిచెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం. తెలంగాణ గడ్డపైనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ పట్ల ఉన్న అభిమానాన్ని ఈ వేడుకలు చాటిచెబుతున్నాయి.
పూరీ తీరంలో కేసీఆర్ సైకత శిల్పం
ఇవాళ ఆయన 72వ పుట్టిన రోజు సందర్భంగా కేసిఆర్ సైకత శిల్పాన్ని రూపొందించిన బీఆర్ఎస్ నేత రవీందర్ యాదవ్
Sand sculpture of KCR on the shores of Puri Today, on the occasion of KCR's 72nd birthday, BRS leader Ravinder Yadav created a sand sculpture of… pic.twitter.com/HmLww5FdXL
— BIG TV Breaking News (@bigtvtelugu) February 17, 2026