ZPTC Elections: స్వేఛ్చ బ్యూరో: వరుస విజయాలను సాధించిన జోష్ లో ఉన్న హస్తం పార్టీ.. నెక్ట్స్ జడ్పీ చైర్మన్ లపై గురి పెట్టింది. అన్ని జిల్లాల్లోని స్థానాలను కైవసం చేసుకోవాల్సిందేనని సీఎం టార్గెట్ పెట్టుకున్నారు. అన్ని జిల్లాల్లోని జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు.సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కనిపించిన సానుకూల వాతావరణాన్ని జడ్పీ ఎన్నికలకు ఇంధనంగా వాడుకోవాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. అధికారం చేతిలో ఉన్నప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనే నినాదంతో సీఎం మైక్రో లెవల్ మానిటరింగ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ముఖ్య నాయకులతో సీఎం ఇంటర్నల్ రివ్యూ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ జెడ్పీటీసీ(ZPTC), ఎంపీటీసీ(MPTC) ఎన్నికలను పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకుల అభిప్రాయాలను కూడా సీఎం సేకరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 566 జడ్పీటీసీ, 5773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనున్నది. ఎందులో 90 శాతం సీట్లను కైవసం చేసుకొవడంతో పాటు ఎంపీపీలు, జెడ్పీ పీఠాలను ప్రత్యర్థి పార్టీలకు దక్కకుండా చేయాలని సీఎం ఆలోచిస్తున్నారు.అన్ని జిల్లాల్లో జడ్పీ చైర్మన్ పీఠాలను దక్కించుకోవడం ద్వారా గ్రామీణ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదగాలని పార్టీ యోచిస్తోంది.తద్వారా పదేళ్ల పాటు పార్టీని బలంగా నడపవచ్చని సీఎం ఆలోచిస్తున్నారు. పదేళ్ల పాటు తామే పవర్ లో ఉంటామని ఇప్పటికే సీఎం పలుమార్లు బలంగా నొక్కి చెప్పారు. దీనిలో భాగంగానే క్షేత్రస్థాయిలో పార్టీని బలంగా ఉంచాలని లక్ష్యం పెట్టుకున్నారు.
Also Read: Crime News: యమపాశమైన విద్యుత్ స్తంభం.. 400 కేజీల పోల్ పడి సమాజ్వాదీ పార్టీ నేత మృతి
త్వరలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్తో భేటీ అయి, ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు.రిజర్వేషన్లు ఇతర న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు నిపుణుల నుంచి లీగల్ ఓపీనియన్ను సేకరిస్తున్నారు.ఎన్నికల నగారా మోగకముందే సీఎం స్వయంగా జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సాకుతో ప్రజల్లోకి వెళ్లి ‘కాంగ్రెస్ వేవ్’ కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు, ఇంచార్జీలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా, అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను తిప్పికొడుతూ, క్లీన్ స్వీప్ చేయడమే కాంగ్రెస్ తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నది.