Telangana: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయడంలో కాంగ్రెస్ ఫెయిలయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ లో మంగళవారం వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నితిన్ నబీన్ సిన్హా హైజరై అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల జ్ఞాపకాలతో కూడిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్నారు. పెద్ద ఎత్తున జాతీయ రహదారులు నిర్మిస్తోందన్నారు. బీబీనగర్ లో ఎయిమ్స్ నిర్మించినట్లు చెప్పారు. వికసిత్ భారత్ లో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని కొనియాడారు.
రాంచందర్ రావు మాట్లాడుతూ..
అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ.. జనసేన ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉందన్నారు. జనసేన, పవన్ కళ్యాణ్ అంటే తమకు గౌరవం ఉందని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్ కు అక్బరుద్దీన్ కి నిర్మల్, బోధన్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అనుమతి ఇస్తారని, కానీ అదే.. కాంగ్రెస్..,జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామిక ధోరణికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ మైండ్ సెట్ కి ఇది నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్డీయేగా తప్పుబడుతున్నట్లు స్పష్టంచేశారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ..
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఏపీకి వెళ్లి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఏమైందని ప్రశ్నించారు. తమ ఉనికికి ప్రమాదం వచ్చిందనుకున్నప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడతారని చురకలంటించారు. రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నప్పుడు అడ్డంరాని తెలంగాణ సెంటిమెంటు ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రోజా ఇంట్లో రొయ్యల పులుసు తినే రోజు కేసీఆర్ పక్కనే కవిత ఉంది కదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేయలేదా అని రఘునందన్ ఫైరయ్యారు.
బీజేపీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు
కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటారని, అయితే.. పక్క రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ మాట్లాడితే కాంగ్రెస్ కు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి కూడా మాట్లాడుతుంటారని, జనసేనకు అభ్యంతరం చెప్పాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. పవన్ వచ్చి మాట్లాడితే ఎందుకంత ఆందోళన చెందుతున్నారని నిలదీశారు. ఏ నాయకుడు ఎక్కడికైనా వెళ్లి సభ పెట్టుకోవచ్చన్నారు. ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది లేదని ఆయన స్పష్టంచేశారు. పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నారని, తమ భాగస్వామ్య పార్టీలు తమకు అండగా ఉండటాన్ని స్వాగతిస్తామన్నారు. ప్రాంతాలుగా విడిపోయి.. ప్రజలుగా కలిసుందామని ఆయన సూచించారు. బీజేపీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలపడమే అసలు సిసలైన నివాళి అని రఘునందన్ రావు తెలిపారు.
Also Read: నేను డాక్టర్ అవ్వాలనుకున్నా.. కానీ: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!