BJP Strategy: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ పోరుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటినుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్(రాష్ట్ర కార్యవర్గ) సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే రానున్న నేపథ్యంలో, ఈ మీటింగ్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆయా కార్పొరేషన్ల పరిధిలోనే పార్టీకి అత్యంత ముఖ్యమైన ఈ సమావేశాలను నిర్వహిస్తుండటం అత్యంత ప్రాధాన్యతాంశంగా మారింది. పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు ఈ సమావేశాలను ఒకే చోట కాకుండా, మూడు ప్రధాన కేంద్రాల్లో ప్లాన్ చేశారు.
హైదరాబాద్, వరంగల్, యాదాద్రి వేదికలుగా ఈ మూడు రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ బలోపేతంపై ఈ వేదికల నుంచి దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా చీఫ్ గెస్ట్గా హాజరవుతుండటం విశేషం. ఆయన మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి, రాష్ట్ర నేతలతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. జాతీయ అధ్యక్షుడే స్వయంగా రంగంలోకి దిగి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ను పర్యవేక్షించనుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా, ఈ పర్యటనలో పలు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన బీజేపీ కార్యాలయాలను కూడా నితిన్ నబీస్ సిన్హా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల బలోపేతం, సోషల్ మీడియా యాక్టివిటీని పెంచడం ద్వారా కేడర్లో పూర్తిస్థాయి జోష్ నింపి, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్గా పార్టీ అడుగులు వేస్తోంది.
Also Read: Black Rain: ఆకాశం నుంచి కురుస్తున్న మరణ శాసనం.. బ్లాక్ రెయిన్ దెబ్బకు మాస్కో వదిలి పారిపోతున్న జనం!
ఈ సమావేశాల్లో కేవలం ఎన్నికల వ్యూహాలే కాకుండా, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై కూడా బీజేపీ సుదీర్ఘంగా చర్చించనుంది. ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమ కార్యాచరణకు ప్రణాళికలు రచించే అవకాశముంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, నిరుద్యోగ సమస్యలు, రైతులకు సంబంధించిన పెండింగ్ హామీలపై పోరాడేందుకు ఒక స్పష్టమైన రోడ్మ్యాప్ను తయారు చేయనున్నట్లు సమాచారం. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసేలా, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు ఈ వేదిక నుంచే బ్లూప్రింట్ సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఇతర పార్టీల నుంచి కీలక నాయకులను బీజేపీలోకి చేర్చుకోవడంపైనా కసరత్తును ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది. అటు ఎన్నికల సన్నాహాలు, ఇటు సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా సాగనున్న ఈ మూడు రోజుల షెడ్యూల్.. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి.
Also read: Food Safety: ఈ చికెన్ తిన్నారా.. మీరు డైరెక్ట్గా దవాఖానకే..!