Karimnagar Mayor Election: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తాజా రాజకీయ పరిణామాల ప్రకారం, కరీంనగర్ మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) దక్కించుకోబోతోందుందని సమాచారం. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ (BRS) ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో బీజేపీకి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది.
మొత్తం 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం ఓట్ల సంఖ్య 69గా ఉంది. అయితే, బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్కు హాజరుకాకపోతే, సభలో ఓటు వేసే సభ్యుల సంఖ్య 59కి తగ్గుతుంది. ఈ క్రమంలో మేయర్ పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 30 కి చేరుకుంటుంది. ఇప్పటికే బీజేపీకి 30 మంది సొంత కౌన్సిలర్లతో పాటు, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు లభించింది. దీంతో బీజేపీ బలం 34కు చేరుకోవడంతో ఆ పార్టీ మేయర్ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకోనుంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యవేక్షణలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి స్వతంత్రులను తమ వైపు తిప్పుకోవడంలో సఫలమైంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి 14 స్థానాలు మాత్రమే ఉండటంతో ఆ పార్టీ రేసులో వెనుకబడింది. బీఆర్ఎస్ పార్టీ తన 9 మంది సభ్యులతో తటస్థంగా ఉండాలని భావించడం బీజేపీకి మరింత కలిసొచ్చింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ చరిత్రలో తొలిసారిగా బీజేపీ పగ్గాలు చేపట్టనుంది. అదే జరిగితే, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు నిజమయ్యే అవకాశం ఉంది.
Read Also: మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక.. హంగ్ మున్సిపాలిటీల్లో ఎవరిది పైచేయి? జిల్లాలవారీగా అభ్యర్థుల జాబితా!