Telangana Municipal Chairman Election: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం నేడు మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ముఖ్యంగా ‘హంగ్’ మున్సిపాలిటీల్లో కింగ్ మేకర్ ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. క్యాంపు రాజకీయాలు, ఎక్స్-అఫీషియో ఓట్లు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారాయి. పార్టీల బీ-ఫామ్ ద్వారా గెలిచిన వారితో పాటు, సీల్డ్ కవర్ల ద్వారా వచ్చే పేర్లు, సభ్యుల మద్దతు ఆధారంగా అదృష్టం ఎవరిని వరించనుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.
జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులకు గాను కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13 స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్-అఫీషియో ఓటు, మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ బలం 16కు చేరగా, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మద్దతుతో బీఆర్ఎస్ బలం కూడా 16కు చేరింది. ఇరుపక్షాల బలాబలాలు సమానంగా ఉండటంతో కడకంచి బాలమణి (కాంగ్రెస్), గోపగాని సుగుణాకర్ (బీఆర్ఎస్) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అదేవిధంగా తొర్రూరులో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఉండగా, ఎక్స్-అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం కూడా 9కి పెరుగుతోంది. ఇక్కడ కూడా రెండు పార్టీలకు సమాన ఓట్లు ఉండటంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది.
మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తలో 7 మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించగా, 5 మున్సిపాలిటీలు హంగ్ దిశగా సాగాయి. హుస్నాబాద్, జోగిపేట, సంగారెడ్డి వంటి చోట్ల కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించగా, గజ్వేల్, దుబ్బాక, తూప్రాన్ వంటి చోట్ల బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. హంగ్ ఏర్పడిన మెదక్, జహీరాబాద్, ఇస్నాపూర్, నర్సాపూర్, జిన్నారం మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు అత్యంత కీలకం కానుంది. జహీరాబాద్లో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15 స్థానాల్లో ఉండటంతో ఇక్కడి స్వతంత్రులు కింగ్ మేకర్లుగా మారారు.
ఆదిలాబాద్ జిల్లాలో భైంసా మున్సిపాలిటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఎంఐఎంకు 12 స్థానాలు ఉన్నప్పటికీ, స్వతంత్రులు 7 మంది కీలకంగా మారారు. బీజేపీ అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి భైంసాలో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగజ్నగర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీల్లో కూడా హంగ్ పరిస్థితులు ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. నిర్మల్ మున్సిపాలిటీ చైర్మన్ గా అప్పాల కావ్య ఏకగ్రీవం కాగా, మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ రేసులో తూముల నరేష్ పేరు వినిపిస్తోంది. చెన్నూరులో పెద్దింటి పద్మ, లక్షేట్టిపేటలో దొంత అంజలి చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
కరీంనగర్ జిల్లాలో మంథని చైర్మన్ పదవి కోసం పెంటరీ రాజు, ఓడ్నాల శ్రీనివాస్ రేసులో ఉండగా, పెద్దపల్లి పీఠం నూగిల్ల మల్లయ్యకు దక్కనుంది. జగిత్యాలలో ములస్థం లావణ్య, సమీండ్ల వాణి వంటి నలుగురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీతో జిందం కళ చక్రపాణిని చైర్ పర్సన్గా ఖరారు చేసే దిశగా ఉంది. హంగ్ ఏర్పడిన మెట్పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిస్తే సమీకరణాలు మారే అవకాశం ఉంది. జమ్మికుంటలో మొలుగు ప్రశాంత్ కుమార్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.