Telangana Tourism: స్వేఛ్చ బ్యూరో: టూరిజంపై ప్రభుత్వం దృష్టిసారించింది. పర్యాటకులకు అనువైన ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే దేవాదాయశాఖకు చెందిన భూములు ఎక్కువగా ఉండటం, అవి రహదారులకు, ముఖ్య పట్టణాల్లో ఉండటం, కొన్ని ఆలయాలకు సమీపంలో ఉండటంతో వాటిని అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుందని అంచనాలు వేసింది. ఆలయ భూములు ఇస్తే కాటేజీలు, రిసార్ట్ ల నిర్మాణం చేపడతామని టూరిజం శాఖ ప్రతిపాదనలు చేసింది. అందుకు దేవాదాయశాఖ సైతం సముఖంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే రెండుశాఖలు ఎంఓయూ చేసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తెలంగాణలో ఆలయాలకు 87235.39ఎకరాలను కేటాయించినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ భూములపై కొరవడటంతో ఆ భూముల ఆక్రమణకు గురవుతున్నాయి. ఇప్పటికే 20124.03 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. విత్ అవుట్ లిటిగేషన్ తో మరో 5569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం చూపడం లేదు. మరో 6 ఎకరాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే ఆ భూముల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోపక్క కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంపైనా దృష్టిసారించింది. కొన్ని ఆలయాలకు చెందిన భూములను లీజులకు ఇవ్వగా కొన్ని భూములు నిరూపయోగంగా ఉన్నట్లు సమాచారం. ఆ భూములను పర్యాటక కేంద్రాలు తీర్చిదిద్దేందుకు టూరిజంశాఖ ముందుకు వచ్చింది. ఈ భూములను తమకు అప్పగిస్తే.. అక్కడ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామంటూ టూరిజంశాఖ ప్రతిపాదన చేసింది. దేవాదాయ శాఖకు లేఖ రాసింది. త్వరలో ఇదే అంశంపై ఉన్నతాధికారుల భేటీ జరుగున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న భూములను పర్యాటక శాఖకు అప్పగిస్తే, అక్కడ భక్తులు, టూరిస్ట్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతి గృహాలు నిర్మిస్తామని దీంతో ఆదాయం వస్తుందని టూరిజంశాఖ అధికారులు తెలిపారు. దీనికి ఎండోమెంట్ శాఖ నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఎంఓయూ(అవగాహన ఒప్పందం)చేసుకోబోతున్నట్లు సమాచారం.
Also Read: Pineapple Kesari: ముక్కంటికి నైవేద్యంగా పైనాపిల్ కేసరి.. 10 నిమిషాల్లో అద్భుతమైన రుచి!
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. భక్తులకు సరిపడా వసతి సౌకర్యాలు లేకపోవడంతో కొంత ఇబ్బందులకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని టూరిజం శాఖ గుట్టను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. కొండకింద ఆలయ భూములు ఉండటంతో ఆ భూములు లీజుకు ఇస్తే కాటేజీలు, వెల్నెస్ సెంటర్లు, బడ్జెట్ హోటళ్లు నిర్మించేలా ప్లాన్ రూపొందించింది. ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు వీకెండ్ స్పాట్గా దీన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నది. ఇది విజయవంతం అయితే రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు అయిన వేములవాడ, భద్రాచలం, బాసర, ఇతర ప్రముఖ ఆలయాల భూముల్లోనూ ఇదే తరహా అభివృద్ధిని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందు సరికొత్తగా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తుంది. అందులో భాగంగానే ఆలయాల వద్ద టెంపుల్ టూరిజంను బలోపేతంపై దృష్టిసారించింది. ఆలయాల వద్ద ఉన్న భూములను లీజుకు తీసుకొని టూరిజం నిధులతో, కొన్నింటికి పీపీపీ మోడల్ లో అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తుంది. కాటేజీలు, రిసార్ట్లు, థీమ్ పార్కులు నిర్మించేలా ప్లాన్ చేస్తున్నది. మౌలిక వసతులు కల్పించడంతో పర్యాటకులను ఆకర్షించవచ్చని దీంతో ఆదాయం పెరుగుతుందని భావిస్తుంది.’వెల్నెస్ సెంటర్లు’ ఏర్పాటుచేయాలని ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. టూరిజంశాఖ తీసుకుంటున్న ఈ నిర్ణయంతోదేవాదాయశాఖ భూములకు రక్షణతో పాటు ఆదాయం సైతం రానుంది. ఆలయాలు సైతం బలోపేతం కానున్నాయి.