Boinpally Market:స్వేచ్ఛ బ్యూరో: బోయినపల్లి మార్కెట్ యార్డ్ ను డంప్ యార్డ్ గా మార్చారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు లేవంటూ స్థానిక ప్రజలు నాయకులు చేస్తున్న ఆందోళనలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బోయినపల్లి మార్కెట్ యార్డ్ ఏర్పడి 24 ఏండ్లవుతోందన్నారు.
రోజూ 10 వేల మంది కస్టమర్లు ఇక్కడికి వచ్చి పోతుంటారని, సంవత్సరానికి రూ.14 నుంచి రూ.15 కోట్ల ఆదాయం వచ్చే మార్కెట్ అని ఆయన పేర్కొన్నారు. 9 నెలలుగా చెత్తను తీసుకువెళ్లే కాంట్రాక్టర్లు, టాయిలెట్స్ కడిగే కార్మికులకు డబ్బులు రాకపోవడం వల్ల వందల లారీల చెత్త పేరుకుపోయిందన్నారు. ఆ మురిగిపోయిన కూరగాయల నుంచి వచ్చే దుర్గంధపూరితమైన నీరు కాళ్ల కిందకు వచ్చి పుండు పడిపోతున్నాయని పేర్కొన్నారు.
ఈ దుర్గంధపూరితమైన వాసన వల్ల కస్టమర్లు రావడం లేదని, మార్కెట్లో బిజినెస్ అంతా తగ్గిపోతోందని ఈటల ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్ వెళ్తే 10 శాతం ఇస్తేనే సంతకం పెడతామని చెబుతున్నారంటే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు. మంత్రికి చెప్పినా, కమిషనర్ కి చెప్పినా ఈ సమస్య పరిష్కారం కాలేదన్నారు. మహిళ టాయిలెట్ కు వెళ్లాలంటే ఇంకో మహిళ కాపలా కాయాల్సి వస్తోందని, టాయిలెట్స్ కు నీళ్లు లేవని, వాటికి డోర్లు కూడా లేవని మహిళలు చెబుతున్నారన్నారు. తాను వస్తున్నానని తెలిసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు తప్పితే.. శాశ్వత పరిష్కారం దొరకలేదన్నారు. అక్కడ ఉన్న చెత్తంతా తొలగించాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేయించాలని డిమాండ్ చేశారు. మొత్తం క్లీన్ చేయించే వరకు ధర్నా కొనసాగుతుందని హెచ్చరించారు.