Bonalu Festival: ఆషాఢ మాసం వచ్చేసింది! హైదరాబాద్లో రేపటి నుంచి బోనాల సందడి ప్రారంభం కానుంది. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. గోల్కొండ నుంచి తొలిబోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కళాకారులు ఆటపాటలు, డీజే సౌండ్స్తో నగరంలో పండుగ శోభను సంతరించుకోనుంది.
సాధారణంగా ఆషాడ మాసంలో వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారం రోజున భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది. ఈ ఏడాది ఆషాడ మాసంలో ముందుగా గురువారం (జూన్ 26న) వస్తుంది. అందుకే గురువారం రోజన బోనాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది తొలుత గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించడంతో భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అవుతుంది. గోల్కొండ తర్వాత ఉజ్జయిని మహం కాళికి, లాల్ దర్వాజ మహాకాళికి బోనాలు నిర్వహిస్తారు. తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో భాగ్యనగరంలో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
బోనం అంటే ఏమిటి?
భోజనం ప్రకృతి అయితే.. దాని వికృతి పదమే బోనం. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి లేక రాగికుండలో వండుతారు. ఆ తర్వాత బోనాల కుండలను వేప రెమ్మలతో, పసుపు, కుంకుమతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతుంటారు. ఇలా తయారు చేసిన బోనాలను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో మహిళలు ఆలయానికి తీసుకెళ్తారు. ఈ బోనాల కుండలను ఇలా బోనం నైవేద్యంగా సమర్పించే తంతును ఊరడి అంటారు.
గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలుస్తారు. బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతోనే ముగిసిపోదు. గ్రామీణ సంబురాలకు సంబంధించిన ప్రతి ఘట్టమూ ఇందులో కనిపిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాలు సమర్పించడం, రంగం పేరిట భవిష్యవాణి చెప్పే ఆచారమూ ఈ బోనాల పండుగలో ఉంటుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆ ఘట్టాన్ని నిమజ్జనం చేయడమూ మనం చూడవచ్చు.
బోనం అసలు చరిత్ర:
అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సంప్రదాయం ఉంది. కొండ కోనల్లో మనిషి జీవించిన కాలంలో ఒక రాయిని దేవతగా చేసుకుని ప్రకృతి తనకు ఇచ్చిన పత్రి, పువ్వు, కొమ్మ, పసుపు కుంకుమ, నీళ్లు, ధాన్యం, కూరగాయలను సమర్పించాడు. అప్పుడు ప్రారంభమైన ఈ సమర్పణమే బోనాల వరకు వచ్చింది. పూర్వ కాలం నుంచే ఉన్న ఈ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది. ఆరు వందల ఏళ్ల నాటి పల్లవ రాజుల కాలంలో తెలుగు నేలపై బోనాల పండుగ ప్రాశస్త్యం పొందిందని ప్రతీతి.
Also Read: ఈ ఆకులతో షుగర్ పరార్..! రోజూ ఇలా తీసుకున్నారంటే జన్మలో రాదు
15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాలు ఏడు కోల్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి, బోనాలు సమర్పించారట. 1676లో కరీంనగర్ హుస్నాబాద్లో ఎల్లమ్మగుడిని సర్వాయి పాపన్న కట్టించి, ఆ దేవతకు బోనాలు సమర్పించినట్టు కైఫీయతుల్లో గౌడనాడులు గ్రంథంలో ఉంది. ఇక హైదరాబాద్ చరిత్రను గమనిస్తే.. 1869లో జంటనగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారిలా వచ్చి ప్రబలడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దైవాగ్రహానికి గురయ్యామని భావించిన అప్పటి ప్రజలు.. గ్రామ దేవతలను శాంతపరచడానికి, ప్లేగు వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి చేపట్టిన క్రతువే ఈ బోనాలు. 1675లో గోల్కొండను పాలించిన లబుల్ హాసన్ కుతుబ్షా కాలంలో బోనం పండుగ హైదరాబాద్లో ప్రారంభమైనట్టు కూడా చరిత్రకారులు చెబుతుంటారు. దీంతో నెలరోజుల పాటు బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.