Medaram Jatara 2026: గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు చిరునామాగా నిలిచే మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రపంచంలోనే కోట్లాది మంది భక్తులు ఆరాధించే ఈ వనదేవతల ఆలయ పునరుద్ధరణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాబోయే జాతరకు ముందే, అంటే ఈ నెల 20లోగా పనులన్నీ పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ మేడారంలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించారు.
హెలికాప్టర్లో మేడారం చేరుకున్న మంత్రులకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు పొంగులేటి, సీతక్క కలిసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ల్యాండ్ స్కేపింగ్, ప్రధాన ఆర్చి నిర్మాణం, హరిత హోటల్ జంక్షన్ సుందరీకరణ పనులను పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాల కోసం ఏర్పాటు చేస్తున్న స్నాన ఘట్టాలు (Bathing Ghats), నీటి నిల్వ కోసం కడుతున్న ఆనకట్ట పనులను తనిఖీ చేశారు. ఇదే సందర్భంగా జంపన్న వాగు వద్ద ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘బ్యాంబు చికెన్ క్యాంటీన్’ను మంత్రులు ప్రారంభించారు.
అనంతరం హరిత హోటల్లో అధికారులతో, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరి 12 నాటికి క్యూ లైన్ల షేడ్స్, సివిల్ వర్క్స్ పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. సంక్రాంతి పండుగ నుంచి జనవరి 31 వరకు మేడారం ప్రాంతం విద్యుత్ కాంతులతో వెలిగిపోవాలని సూచించారు. తాగునీటి ఎద్దడి లేకుండా బోర్ వెల్స్, చేతి పంపులు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య నిర్వహణ కోసం జోన్ల వారీగా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. పబ్లిక్ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆలయ పునరుద్ధరణ పనులు 200 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా రాతి కట్టడాలతో (Stone Construction) పూర్తి చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సందర్శించి, ఒక రోజు అక్కడే బస చేసి, మరుసటి రోజు ఉదయం పునరుద్ధరించిన ఆలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈసారి జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. మంత్రి సీతక్క దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారని ప్రశంసించారు.
Read Also: దేశ వ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ పరుగులు, ఆ ఒక్క రాష్ట్రంలో తప్ప!