Tank Neglect: స్వేచ్చ బ్యూరో: రైతులకు ఎంతో మేలు చేసే చెరువుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు సాగునీరు అందడం లేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వై.నరోత్తం తెలిపారు. శనివారం జహీరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. చెరువులకు మరమ్మతులు చేయకపోవడం, కాలువలు పూడుకపోయి ఎలాంటి ఉపయోగంలో లేకపోవడం వల్ల రైతుల పంటలకు నీరందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జహీరాబాద్లో ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ డివిజన్ కార్యాలయం ఉందని అందులో పని చేసే 50 మంది సిబ్బందికి ఎలాంటి పని లేకుండా పోయిందన్నారు. సంవత్సరానికి సిబ్బందికి నాలుగు కోట్ల రూపాయల వరకు వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ వారి ద్వారా రైతులకు నయా పైసా లబ్ధి చేకూరడం లేదన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 76 చెరువులు ఉన్నాయని వాటి ద్వారా 12262 ఎకరాలకు నీరందించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల కేవలం 3000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. చెరువులకు మరమ్మతులు లేకపోవడం, కాలువలు పూడుకొని పోవడం, చెరువు కట్టలకు మరమ్మతు చేయకపోవడంతో చెరువులో నిండిన నీటిని పూర్తిస్థాయిలో రైతులకు అందడం లేదన్నారు.
Also read: Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖకు.. మరో అంతర్జాతీయ స్థాయి ఘనత..!
ఇరిగేషన్ శాఖ అధికారులు రైతులకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేయకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎన్ఓసీలు ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చెరువుల మరమ్మత్తుచేసి, కాలువలలో పేరుకుపోయిన పూడికను తొలగించి పూర్తిస్థాయిలో రైతులకు నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. బనకచర్ల, కావేరి ప్రాజెక్టుల నుండి గోదావరి నీటిని కావేరి లో కలపడం వల్ల తెలంగాణకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ నాయకులు షికారి గోపాల్, చెంగల్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
Also read: TGSRTC Merger: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విలీనం తర్వాతే వేతన సవరణపై నిర్ణయం!