Illegal Venture: స్వేచ్చ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఓ వెంచర్ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ అనుమతులు పొందకుండా భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయాలు జరుపుతున్నారని, కొనుగోలుదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ వెంచర్లపై గ్రామపంచాయతీ అధికారులు సైతం స్పందించి, సంబంధిత స్థలంలో “అనధికారిక వెంచర్” అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. తొర్రూరు మండలంలో ఇటీవల కాలంలో అనుమతులు లేని వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, అవసరమైన అనుమతులు పొందకుండా ప్లాట్లుగా విభజించి విక్రయాలు సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తక్కువ ధరకు స్థలాలు ఇస్తామంటూ ప్రచారం చేసి అమాయక ప్రజలను ఆకర్షిస్తున్నారని పేర్కొంటున్నారు.
వెలికట్ట గ్రామంలో సర్వే నంబర్ 143లో సుమారు 80 గుంటల భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం లేఅవుట్ అనుమతులు, ఇతర శాఖల క్లియరెన్సులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ వాటిని పక్కనబెట్టి విక్రయాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల దృష్టికి చిక్కకుండా ఉండేందుకు ప్లాట్లను గజాల వారీగా కాకుండా గుంటల వారీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Also read: Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖకు.. మరో అంతర్జాతీయ స్థాయి ఘనత..!
వెంచర్ అనుమతులు, అభివృద్ధి రుసుములు, ఇతర చార్జీల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఎగ్గొట్టేందుకు కొందరు రియాల్టర్లు ఇలాంటి మార్గాలను అనుసరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా, కొనుగోలుదారులు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అనుమతులు లేని వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారు భవిష్యత్తులో ఇల్లు నిర్మించుకోవాలన్నా, బ్యాంకు రుణాలు పొందాలన్నా, విద్యుత్, నీటి వంటి మౌలిక సదుపాయాలు పొందాలన్నా అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.అంతేకాకుండా లేఅవుట్ క్రమబద్ధీకరణ కోసం అదనపు వ్యయాలు భరించాల్సి వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.
వెలికట్ట గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్ ఏర్పాటు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించి సంబంధిత స్థలంలో “అనధికారిక వెంచర్” అని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశాం. ప్రజలు ఆ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు. కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు.
Also read: TG Ration Card: ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు.. అయినా రేషన్ కార్డు జారీ!