సింగరేణి కాలరీస్ సంస్థలో భారీ స్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసింది. లోక్ భవన్లో గవర్నర్తో సమావేశమైన ఈ బృందం, సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను, డాక్యుమెంట్లను ఆయనకు అందజేసింది.
అనంతరం లోక్ భవన్ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఒక ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహణ కోసం సింగరేణికి చెందిన సుమారు రూ. 10 కోట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ముఖ్యమంత్రి, ఇప్పుడు సింగరేణి సంస్థతో కూడా ఫుట్ బాల్ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే ఆయన ఒక కోల్ మాఫియా నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.
ఈ కుంభకోణాన్ని తాము ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుండి ప్రభుత్వంలో వణుకు మొదలైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఓవర్ బర్డెన్ టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు పాతరేశారని, తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే వింత నిబంధనను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. దేశంలో ఏ ఇతర బొగ్గు గనుల టెండర్లలో లేని విధంగా, కేవలం సింగరేణిలో మాత్రమే ఇలాంటి నిబంధనలు పెట్టి అవినీతికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ అవినీతిని తాము సాక్ష్యాధారాలతో నిరూపించినా, అధికార యంత్రాంగం నుండి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ అన్నారు. ఈ స్కామ్ బట్టబయలు కావడంతో పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం విచారణల పేరిట కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఒకరిద్దరిని విచారణకు పిలవడం కేవలం నాటకమని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీసుకురావాలంటే గవర్నర్ జోక్యం చేసుకొని స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని, సంస్థ ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ: Mahesh Kumar: తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు.. బీఆర్ఎస్ పని ఖతం, మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు