BRS Drama :
⦿ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా గులాబీ ఎత్తులు?
⦿ మొన్న హాస్టళ్ళ మూసివేత, ఫుడ్ పాయిజన్..
⦿ నిన్న లగచర్లలో రైతుల పేరిట కలెక్టర్పై దాడి
⦿ నేడు ప్రైవేటు ఆస్పత్రుల ఆరోగ్యశ్రీ సమ్మె నోటీస్
⦿ ఓ గులాబీ సీనియర్ నేత వరుస ప్రయత్నాలు?
⦿ నేరుగా ప్రజలతో కనెక్ట్ అయ్యే అంశాల ఎంపిక
⦿ ఉద్దేశపూర్వకంగా జనంలో అలజడి రేపే కుట్ర!
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ప్రశాంతంగా ఉన్న కొలనులో అలజడి సృష్టించాలంటే.. ఒక రాయి విసరాలి! చల్లగా ఉన్న చోట సెగలు రేపాలంటే.. నిప్పు రాజేయాలి! ఒక వ్యవస్థ ప్రజాదరణ పొందుతున్నదంటే.. దాని మీద అపనమ్మకం పాదుకొల్పాలి! ఒక ప్రభుత్వం జనం గుండెల్లో చోటు సంపాదించుకుంటున్నదంటే.. అదే గుండెల్లో ఆగ్రహావేశాలు రగల్చాలి! ఇదీ ఇప్పుడు కుట్ర సిద్ధాంత‘కారు’ల ప్లాన్!! మొన్నటికి మొన్న రైతు రుణమాఫీ విషయంలో రైతులతో నిరసనలకు ప్లాన్ చేసినా.. అద్దె చెల్లించలేదన్న అంశాన్ని పావుగా వాడుకుని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లకు అనేక చోట్ల ఒకే సమయంలో తాళాలు వేయించినా.. లగచర్లలో రైతుల ముసుగులో కలెక్టర్పై దాడి చేయించినా.. హాస్టళ్లలో ఫుడ్పాయిజనింగ్..! ఇలా అనేక అంశాల్లో చుక్కలన్నీ కలుపుకొంటూ వెళితే.. బీఆరెస్ ప్రమేయం జాడలు తేలుతున్నాయి! ఇదే జాబితాలో తాజాగా ఆరోగ్యశ్రీ దవాఖానల అంశం చోటు చేసుకున్నది. సాధారణ ప్రజలతో నేరుగా సంబంధం కలిగిన ఈ ప్రధానమైన అంశాలను రచ్చ చేయడంలో బీఆరెస్కు చెందిన ఒక కీలక నేత హస్తం ఉందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి!
తమ అక్రమాలు వరుసగా బయటకు వస్తుండటంతో దోషులుగా నిలబడాల్సి వస్తున్నదన్న బాధ! పదేళ్ల నాటి పాపాలు ఇంకెన్ని వెలుగు చూస్తాయోనన్న ఆందోళన! కీలక నేతల అరెస్టుల వరకూ పరిస్థితి వెళిపోతుండటంతో ఓ మూల భయం! వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే ప్రయత్నాలను బీఆరెస్ ముమ్మరంగా చేస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుట్ర కోణంలో భాగంగానే తాజాగా ఆరోగ్యశ్రీ బిల్లుల పెండింగ్ బకాయిల విషయం చర్చల్లోకి వచ్చింది. బకాయిలు పేరుకున్నాయంటూ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల (నెట్వర్క్) సంఘం ట్రస్ట్ ఇటీవల సీఈవోకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీని వెనక కూడా బీఆర్ఎస్ పకడ్బందీ ప్రణాళిక ఉన్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాల మాటల్లో వ్యక్తమవుతున్నది.
బీఆర్ఎస్లో సమస్యలను చక్కదిద్దే వ్యక్తిగా ఉన్న ఒక నేత పనిగట్టుకుని ఆస్పత్రుల యాజమాన్యంతో, సంఘం బాధ్యులతో మాట్లాడి ఈ వ్యవహారాన్ని నడిపి ప్రభుత్వానికి ట్రబుల్ మేకర్ అవతారం ఎత్తారన్నది వారి మాటల సారాంశం. ఆ నేతకు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ద్వారా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహకవర్గ పెద్దలతో మాట్లాడి, నోటీసు వ్యవహారాన్ని నడిపించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఆరోగ్యశ్రీ చికిత్సలను నిలిపివేయడం ద్వారా పేషెంట్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగి వైద్యసేవలు ప్రభావితమవుతాయని, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
నాడు గురుకుల స్కూళ్ళు, హాస్టళ్ల మూసివేత :
గతంలో రెసిడెన్షియల్ స్కూళ్ళు, హాస్టళ్ళను మూసివేసినప్పుడు కూడా ప్రభుత్వం అద్దె చెల్లించడం లేదన్న కారణాన్ని ఆ భవనాల యజమానులు ప్రస్తావించారు. ఈ స్కూళ్లు, హాస్టళ్ళను సొంత భవనాల్లో నెలకొల్పడానికి బదులుగా గులాబీ పార్టీకి స్థానికంగా పనిచేస్తున్నవారి భవనాలను గత ప్రభుత్వం అద్దెకు తీసుకుని పెట్టినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ళకు దీర్ఘకాలంగా అద్దె చెల్లించక బకాయిలు పేరుకుపోయాన్న కారణంతో నల్లగొండ, భువనగిరి, తుంగతుర్తి, వరంగల్, భూపాలపల్లి, హుజూర్నగర్, బెల్లంపల్లి, తాండూర్ తదితర నియోజకవర్గాల్లో ఒకేసారి మూసేయడం చర్చనీయాంశంగా మారింది. ఒకేసారి ఇన్ని చోట్ల కూడబలుక్కున్నట్లుగా మూసేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఆరా తీసిన తర్వాత గులాబీ పార్టీకి చెందిన వ్యక్తులవని తేలింది.
కుట్రలో భాగంగానే ఫుడ్ పాయిజనింగ్!
హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు కూడా వరుసగా చోటు చేసుకోవడం సంబంధిత శాఖ అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఈ విషయంలో అధికారుల నుంచి కూపీ లాగితే.. సదరు కాంట్రాక్టులు పొందినవారు గత బీఆరెస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగినవారేనని వెల్లడైంది. ఆహార పదార్థాల నాణ్యతలో లోపం, శుభ్రతను పాటించకపోవడం.. ఇలాంటి అంశాలతో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతున్నట్లు తేలినా ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు సరిపోవడంలేదని, రేట్లను రివైజ్ చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. రాజకీయాల కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతారా? అంటూ తల్లిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. బీఆర్ఎస్ నేతల ప్రమేయం ప్రత్యక్షంగా కనిపించకపోయినా నీడలా వెంటాడి ఈ వ్యవహారాన్ని నడిపిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
లగచర్లలోనూ రైతుల రూపంలో!
లగచర్ల భూసేకరణ వ్యవహారంలోనూ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లా ఉన్నతాధికారి మీద ప్రజలు, రైతులు దాడిచేసేంత పరిస్థితి ఉన్నదా? అనే అనుమానంతో అధికారులు ఆరా తీస్తే.. రైతులను రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా కొందరు బీఆరెస్ లీడర్లు పక్కాగా ప్లాన్ చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. చివరకు పోలీసులు బీఆరెస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహా కొందరిపై కేసులు పెట్టారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, రాష్ట్రవ్యాప్తంగా రైతాంగంలో సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ నడిపించిన వ్యవహారమనే చర్చలు ఓపెన్గానే జరిగాయి. అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు రైతులు భూములు ఇవ్వకుండా గందరగోళ వాతావరణాన్ని సృష్టించాలన్నది ఆ పార్టీ ప్రయత్నమని కాంగ్రెస్ నేతలు పలువురు కామెంట్ చేశారు.
ఆరోగ్యశ్రీ బిల్లుల రూపంలో ఆస్పత్రుల ద్వారా!
ఈ వరుస ఘటనలకు కొనసాగింపుగా ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులను బీఆరెస్ నేతలు ఎంచుకున్నట్టు తెలుస్తున్నది. నెట్వర్క్ హాస్పిటళ్ల సంఘం పెద్దల ద్వారా డ్రైవ్ చేసి, ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సలను ఆపేయంచి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి సదరు పరిష్కార పెద్ద పకడ్బందీ ప్లాన్ చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు నోటీసు ఇచ్చిన తర్వాత మంత్రి జోక్యం చేసుకున్నారు. పెండింగ్ బిల్లుల్లో కొంత మొత్తాన్నివెంటనే విడుదల చేయించారు. మరో నెల రోజుల్లో మిగిలిన బకాయిలను కూడా రిలీజ్ చేస్తామని హామీ కూడా ఇచ్చారు. నిధుల విడుదల తర్వాత సేవలను పునఃప్రారంభిస్తామని అసోసియేషన్ హామీ ఇచ్చినా కొన్ని ఆస్పత్రులు ఇప్పటికీ సేవలను నిరాకరిస్తూనే ఉన్నాయి. ఆస్పత్రుల ముందు బోర్డులు ఇంకా తీయకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. త్వరలోనేరైతు భరోసా నిధుల అంశాన్ని తీసుకుని రైతును రోడ్డెక్కించే ప్లాన్ చేస్తున్నదని, జిల్లాల వారీగా నిరసనలకు ప్లాన్ చేస్తున్నదని బీఆరెస్ వర్గాల కథనం. తమ నేతలను ఇబ్బందికి గురి చేస్తున్న ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు ఇటువంటివి తప్పదన్న అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.