తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం అధ్యక్షతన గురువారం ‘సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్’ (Civil Military Liaison Conference) నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, సైన్యం మధ్య నెలకొన్న పలు భూ సమస్యలు, పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
దశాబ్ద కాలంగా అన్యాయం..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూళ్లను మంజూరు చేసినప్పటికీ, గత పదేళ్లుగా తెలంగాణకు ఒక్క స్కూల్ కూడా మంజూరు కాలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని యువతకు రక్షణ రంగంలో మెరుగైన శిక్షణ అందించేందుకు సైనిక్ స్కూల్ ఆవశ్యకతను ఆయన వివరించారు. అలాగే, ప్రస్తుతం పుణెలో ఉన్న సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని భౌగోళికంగా.. వ్యూహాత్మకంగా కీలకమైన హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
రక్షణ రంగానికి పూర్తి సహకారం..
దేశ భద్రతకు సంబంధించిన ఏ విషయంలోనైనా సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు నిదర్శనంగా వికారాబాద్ జిల్లాలో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3,000 ఎకరాల భూమిని కేటాయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. సైన్యానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు..
ఆర్మీ మరియు తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్లో ఉన్న భూ వివాదాలు, రహదారుల నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఇరుపక్షాల నుంచి సమన్వయం అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. దీని కోసం ఆర్మీ వైపు నుండి ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు. నిరంతర చర్చలు, సమన్వయం ద్వారానే ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చని ఆయన అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డితో పాటు రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.