బీఆర్ఎస్ పార్టీ అక్రమ మైనింగ్ మీద సిట్టింగ్ జడ్జి లేదా హౌస్ కమిటీ వేయాలని పట్టుబట్టడం కొత్త చర్చకు దారితీసింది. ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో అక్రమ మైనింగ్కు తెరలేపారని ప్రధానంగా ఆరోపించారు. ఆయన కనుసన్నల్లోనే రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీ సహజ వనరులను దోచేస్తున్నదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు సభలో ప్రస్తావించారు. దీనిమీద విచారణకు ఆదేశించాలని ప్రతిపక్ష సభ్యులు హరీశ్ రావు, కేటీఆర్ ప్రధానంగా డిమాండ్ చేశారు.దీంతో సభలో కాస్త గందరగోళం నెలకొన్నది. స్పీకర్ వద్దకు బీఆర్ఎస్ నేతలు దూసుకెళ్లగా వారిని మార్షల్స్ అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ పాలనలో జోరుగా అక్రమ మైనింగ్ సాగుతోందని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మైనింగ్ పేరిట రాష్ట్ర వనరులను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ ఆరోపించగా.. దీనిపై సీబీసీఐడీ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ వేదికగా స్పష్టంచేశారు. కాగా, బీఆర్ఎస్ మాత్రం సీబీసీఐడీ వద్దంటూ హౌస్ కమిటీ వేయాలని కొత్త డిమాండ్ తెరమీదకు తెచ్చింది. అయితే, సీబీసీఐడీ ప్రకటనకు ముందు సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గత బీఆర్ఎస్ హయాంలో జోరుగా అక్రమ మైనింగ్ జరిగిందని, అందులో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల హస్తం ఉందని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమ మైనింగులపైనా సీబీసీఐడీ విచారణ జరిపిస్తామని సీఎం ప్రకటించడంతో బీఆర్ఎస్ నేతలు మాట మార్చినట్టు తెలుస్తున్నది. మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు,మరో ముగ్గురు నలుగురు సైతం అక్రమ మైనింగులో కోట్లు గడించారని, పలువురిపై ఇప్పటికే ఈడీ విచారణ జరుగుతోందని గుర్తుచేశారు. వాటిపైనా విచారణ జరుపుతామన్నారు. దానికి తోడుప్రస్తుతం జరుగుతున్న వాటిపైనా చర్యలు చేపడతామన్నారు. సీఎం ప్రకటనతో అక్రమ మైనింగుకు పాల్పడిన వారి గుండెళ్లో రైల్లు పరిగెడుతున్నట్టు సమాచారం.
ఖాకీ వదిలి విద్యార్థినిగా మారిన ఎస్సై.. ఆకతాయిల ఆటకట్టించిన అమూల్య సాహసం!
అందుకే సిట్టింగ్ జడ్జి లేదా హౌస్ కమిటీ విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీద రూ. వందల కోట్ల టాక్స్ ఎగవేసినట్టు ఆరోపణలు వచ్చాయి.దీనిపై ఈడీ కేసు నడుస్తున్నది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ పేరిట అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని కారు పార్టీ ఆరోపించడంతో దానిపైనా విచారణకు సిద్దమని సీఎం అన్నారు. సీబీసీఐడీ అయితే తమ బంఢారాలు బయటపడుతాయని ఆలోచించిన బీఆర్ఎస్ లీడర్లు.. హౌస్ కమిటీ కోసం పట్టుబడుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.తమ అవినీతి బయట పడకూడదనే బీఆర్ఎస్ సీబీసీఐడీ విషయంలో వెనక్కి తగ్గిందని ఆరోపణలు ఉన్నాయి. కాగా, మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డి ఈ అక్రమ మైనింగులో భాగస్వాములు అని అందుకే సీఎం ఆయన్ను వెనకేసుకస్తున్నారని గులాబీ లీడర్లు ఆరోపణలు చేస్తున్నారు.