బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై రెండేండ్లు అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ లెక్క వేరు. ఇప్పుడు ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేవు. పదేండ్లు అధికారంలో ఉన్న వారంతా ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చేసరికి దాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నట్టు చర్చ జరుగున్నది. అదే ఆవేశం, అదే అనాలోచిత నిర్ణయాలు నేటికీ వారిని మరింత చిక్కుల్లోకి నెడుతున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలే అందుకు నిదర్శనం. పవర్ లేనప్పుడు ఆవేశం పనికిరాదు. ఆలోచన, సమయం, సందర్భం చూసి మాట్లాడాలి. ఎప్పుడు ఎలా స్పందించాలో అలాగే ముందుకు వెళ్లాలి. అధికార పార్టీతో పోటీ పడకూడదు. తప్పులను ఎత్తిచూపాలి కానీ తమ ఆరోపణలు అవతల పార్టీకి ప్లస్ అవ్వరాదు. కానీ, గులాబీ లీడర్ల ఆరోపణలు, విమర్శలు ఆ పార్టీకే చేటు చేస్తున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.
అధికారం అనేది పులిమీద సవారి లాంటిది. ఒక్కసారి పవర్ పోతే ఆ పులే మనల్ని మింగేస్తుంది అనేది పొలిటికల్ వర్గాల్లో ఎక్కువగా వినిపించే డైలాగ్.. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఇదే.. అధికారం ఉంటే ఎవరైనా దగ్గరకు వస్తారు. కానీ, దూరమైతే అక్కడ నుంచి అంతా దూరం అవుతారు. బెల్లం చుట్టూ చీమల గంపు లాగా.. అలాంటప్పుడే తప్పు ఎక్కడ జరిగింది అనేది అంచనా వేసి మళ్లీ ఆ తప్పు వచ్చే ఎన్నికల్లో రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. నిరాశ, నిస్పృహలో ఉన్న కేడర్కు భరోసానివ్వాలి. ఏ కష్టమొచ్చినా మీకు పార్టీ అండగా ఉంటుందనే నమ్మకం వారికి కల్పించాలి. ఇలాంటి ఒక భరోసా మరల పార్టీకి జవసత్వాలను తీసుకురాగలదు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో నెగెటివ్ ఫలితాలు రావడంతో బీఆర్ఎస్లో అగ్రనేతలు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు తెలుస్తున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రులు సైతం నెమ్మదిగా కేడర్కు దగ్గర అవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ఇటీవల జిల్లాల్లో పర్యటిస్తూ గెలిచిన సర్పంచులను సన్మానించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఒక్క రెండేండ్లు ఓపిక పట్టాలని, అధికార పార్టీ నేతలు ఎవరైనా ఇబ్బంది పెడితే నోట్ చేసుకోవాలని వారికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వస్తానని భరోసానిస్తున్నారు. మరల అధికారం మనదే.. అనే సంకేతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్కు ఇస్తున్నారు.
అధికారం వస్తుందని అంత నమ్మకం నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదా? లేక అదంతా ఓవర్ కాన్ఫిడెన్సా? అనేది అర్థం కావడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. ప్రజలు గులాబీ పార్టీ మీద అంతగా అసంతృప్తితో లేరని నేతలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఎందుకంటే ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. రైతులు కూడా కాంగ్రెస్ సర్కార్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. రుణమాఫీ, రైతు భరోసా, పెట్టుబడి సాయం అందుతున్నాయని వారు చెబుతున్నారు.మహిళలు సైతం సంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరి అలాంటప్పుడు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు అధికారం ఖాయమని కేటీఆర్, హరీశ్ రావులు చెప్పడం వెనుక ఉన్నది నమ్మకమా? ఓవర్ కాన్ఫిడెన్సా? అనేది ప్రజలే నిర్ణయించాలి.