రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర అవవాదును మూటగట్టుకుంది. సర్కారును సవాల్ చేసిన ఆ పార్టీ.. అసెంబ్లీలో సర్కార్ అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక సెషన్ నుంచి బయటకు రావడమే కాకుండా ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. దానికి ఓ పేరు కూడా పెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమకు కండిషన్స్ పెడుతున్నారని.. మాజీ సీఎంను ఇష్టానుసారంగా దూషించడం, బాడీ షేమింగ్ చేస్తున్నారనే పలు కారణాలతో అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్టు గులాబీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రకటించారు. ఇంతకూ హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం కరెక్టెనా?
ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు.. తమ సమస్యలపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని, నిధులు తీసుకురావాలని కోరుకుంటారు. ఈ విషయం ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. తమ నియోజకవర్గాన్ని, సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో తాను ఎలా ప్రజలకు మొహం చూపించాలని భావిస్తారు. కానీ, అసెంబ్లీ సెషన్ నిర్వహించినప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, ప్రభుత్వానికి విన్నవించకుండా.. వారు అడిగే సమస్యలకు సమాధానం చెప్పకుండా సభను బహిష్కరించడం ఎంతవరకు కరెక్టు?అని నియోజకవర్గాల్లో చర్చ జరుగుతున్నది. కృష్ణా జలాలు, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు అనేది రాష్ట్రం ఆస్తి.అధికార పార్టీ మంత్రులు, సీఎం రేవంత్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది. అలాగే ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు వారు సమాధానాలు ఇవ్వడం కూడా ప్రభుత్వం బాధ్యత.
గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టారని అధికార పార్టీ ఆరోపిస్తున్నది. అదేవిధంగా ఏపీకి 511 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రి హరీశ్ రావు అంగీకరిస్తూ సంతకాలు చేశారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్, మంత్రులు ప్రశ్నించారు.దీనికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ సమాధానం ఇవ్వాలి కదా? ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయని, వాటిని చూపిస్తున్నారు. మరి మీ దగ్గర ఏం ఉన్నాయి.. జనాలకు అర్థం అయ్యేలా చెప్పాలి కదా? లేదంటే చేసిన తప్పును బహిరంగంగా అంగీకరించాలి. అలా కాకుండా సభను వాకౌట్ చేయడం అంటే పరోక్షంగా ఓటమిని, తప్పు చేశామని అంగీకరించినట్టే కదా? ..
Bhogapuram Airport: ఏపీకి గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్పోర్టులో తొలిసారి విమానం ల్యాండింగ్
గులాబీ పార్టీ అధికార పార్టీకి ఇప్పటికే చాలా సవాళ్లు విసిరింది. అసెంబ్లీ సమావేశాల్లో వాటిపై చర్చించాలని.. సభను 15 రోజులు నిర్వహించాలని బీఏసీలో కోరింది. తీరా వారు సభను ప్రతిపక్షం కోరిక మేరకు నిర్వహిస్తామని క్లారిటీ ఇస్తున్నా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశాలను బహిష్కరించడం ఎంతవరకు కరెక్టు? అయితే, కేసీఆర్ ఇటీవల చెప్పినవన్నీ అబద్ధాలే అని అంగీకరించినట్టేనా? అని అధికార పార్టీ మంత్రులు, నేతలు ప్రశ్నిస్తున్నారు. మీరు తప్పు చేయకపోతే సెషన్స్కు హాజరుకావాలని లేదంటే ఇంకోసారి ప్రభుత్వానికి సవాళ్లు విసిరే ధైర్యం చేయద్దని అంటున్నారు. మరి దీనిపై ప్రతిపక్షాలు ఏం సమాధానం చెబుతాయి..