ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫ్రస్టేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. సర్కారు మీద వారంతా కోపంతో రగిలిపోతున్నట్టు సమాచారం. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుండగా.. సీఎం రేవంత్ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటంతో బీఆర్ఎస్ పాచికలు పారడం లేదని తెలుస్తోంది. అందుకే ఎలాగైనా సర్కారు మీద పైచేయి సాధించాలని బీఆర్ఎస్ సీనియర్లు హరీశ్ రావు, కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.వారు ఏ నినాదం ఎత్తుకున్నా వారికి ప్రజల నుంచి మద్దతు లభించడం లేదని తెలుస్తోంది. అందుకే వారంతా తీవ్ర అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే సర్కారు ఏదైనా పని తలపెడితే పదే పదే అడ్డు తగులుతున్నట్టు చర్చ జరుగుతున్నది.
గతంలో బీఆర్ఎస్ పార్టీ పదేండ్లు అధికారంలో ఉన్నది. ఆనాడు సర్కారుకు వ్యతిరేకంగా ఎవరైనా మీడియా ఎదుట మాట్లాడినా, పదే పదే వ్యతిరేక ప్రచారం చేసినా, నిరసన తెలిపేందుకు రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించినా పోలీసులు ముందస్తుగానే వారిని గృహనిర్బంధం చేశారు.అందులో పురుషులు, మహిళలు అనే తేడా కూడా చూపించలేదు. ఒకానొక సమయంలో ఓ యూట్యూబ్ చానెల్పై పలుమార్లు దాడులకు పాల్పడి, అక్కడి ఉద్యోగులు, ఫర్నిచర్ సైతం ధ్వంసం చేశారు గులాబీ శ్రేణులు. అవన్నీ మర్చిపోయిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కొత్త రాగం ఎంచుకున్నారు.
తాజాగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సహా పలువురు గులాబీ సీనియర్లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో గులాబీ లీడర్లు కొందరు రోడ్డెక్కి నానా రభసా చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో ఇండస్ట్రియల్ పార్కు కోసం జరుగుతున్న భూ సేకరణపై రచ్చ నడుస్తోంది. పేదలు, దళితుల భూములు లాక్కుని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నదని హరీశ్ రావు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ భూ సేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న బాధితులను కలిసేందుకు హరీశ్ రావు మంగళవారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన్ను మరికొందరు లీడర్లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇలా చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కానీ, రేవంత్ సర్కార్ కావాలనే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
4 రాష్ట్రాలు. 365 స్మార్ట్ క్లాస్రూమ్లు.. విద్యార్థుల పాలిట వరంలా మంచు లక్ష్మీ !
హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట వందల ఎకరాల పేదలు, దళితుల భూములను గుంజుకుని ప్రవేటుకు అప్పగించాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేసిందని ఆరోపించారు. కళ్లాపూర్ వద్ద టెంట్లను పీకేయడం, మహిళలను అరెస్టు చేయడం ‘ప్రజాపాలన’ కాదని, ఇది ‘భక్షక పాలన’ హరీశ్ రావు ధ్వజమెత్తారు. నాడు ఇందిరమ్మ పంపిణీ చేసిన భూములను, నేటి ఇందిరమ్మ పాలనలో గద్దల్లా వాలి లాక్కోవడం దారుణమని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కేవలం భూముల చుట్టూనే తిరుగుతున్నాయని, మూసీ, హైడ్రా, లగచర్ల నుంచి పరిగి వరకు పేదల ఇళ్లు, భూములపైనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ (SC), ఎస్టీ (ST)లకు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని, ఒకవేళ ప్రాజెక్టుల కోసం భూములను సేకరిస్తే పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు.కానీ, నేడు అందుకు విరుద్ధంగా, ఎకరాకు రూ. కోటి విలువ ఉన్న భూమిని కేవలం రూ.10 లక్షలకో, రూ.20 లక్షలకో గుంజుకుంటున్నారని ఆరోపించారు. అయితే,బీఆర్ఎస్ హయాంలోనూ అభివృద్ధి పేరిట పేదలు, దళితుల భూములను లాక్కున్నారని.. ఆదివాసీలకు అటవీ భూమి హక్కులు కల్పిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ ఏం చేసిందని కాంగ్రెస్ శ్రేణులు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.