Jeevan Reddy: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి.. కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై వచ్చిన ఆరోపణలు.. మైనర్ బాలిక ఉదంతంపై ప్రభుత్వం.. పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు.
బండి సంజయ్ తనది సంప్రదాయ పార్టీ అని.. ధర్మం కోసం కట్టుబడిన పార్టీ అని చెప్పుకుంటారని.. కానీ ఆయన కుటుంబ సభ్యులే ఒక ఆడబిడ్డకు అన్యాయం చేయడం సిగ్గుచేటని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ ‘బేటీ బచావో’ అని నినాదాలు చేస్తూ.. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకోవడం ఆశ్చర్యకరమన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా చెప్పుకునే బండి సంజయ్.. తన సొంత కుటుంబానికి క్రమశిక్షణ నేర్పలేనప్పుడు దేశానికి ఏం నేర్పిస్తారని నిలదీశారు. సాధారణ నేరానికి అదనంగా పోక్సో (POCSO) చట్టం వర్తిస్తుందని.. భగీరథ్ చేసిన నేరానికి 20 ఏళ్ల శిక్ష పడుతుందని ఆయన గుర్తు చేశారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా దేశంలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన బండి సంజయ్.. తన కుటుంబ సభ్యులు చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం శిక్షార్హమని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ కు నైతికంగా మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు మాట్లాడితే కరీంనగర్లో ఎమ్మెల్యే నివాసంపై దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బండి సంజయ్ మధ్య ‘ఫెవికల్’ బంధం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంపై హోంమంత్రిగా రేవంత్ రెడ్డి పర్యవేక్షించకపోవడం.. పీసీసీ కనీసం ఖండించకపోవడం వీరి మధ్య ఉన్న లాలూచీకి నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మైనర్ బాలికపై హానీ ట్రాప్ నేరం ఎలా ఆపాదిస్తారని.. మోదీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. నేరానికి అనుగుణంగా సెక్షన్లు పెట్టకుండా నిందితుడిని తప్పించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలకు పేరుగాంచిన కరీంనగర్ జిల్లా నేరాలకు చర్చగా రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా జీవితంలో ఉండే నాయకుల జీవితాలు ఆదర్శంగా.. పారదర్శకంగా ఉండాలని జీవన్ రెడ్డి సూచించారు. మోదీ అండ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లకు గంతలు కట్టుకున్నారని విమర్శించారు. ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగిన న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని.. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
Read Also: మేడ్చల్లో హై టెన్షన్.. బండి భగీరథని అరెస్టు చేయాలంటూ చిత్ర పటం దగ్ధం