తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ శాసనసభ్యులు మరోసారి గందరగోళం సృష్టించారు. నిన్న సాయంత్రం ఏదైతే టాపిక్ మీద సభకు అంతరాయం కలిగించారో మరల అదే టాపిక్ తీశారు. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో స్పీకర్ హౌస్ కమిటీని వేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. సభ ప్రారంభకాగానే బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో సభ దద్దరిల్లింది. మంత్రి పొంగులేటిని బీఆర్ఎస్ లీడర్లు కార్నర్ చేశారని స్పష్టంగా అర్థం అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తామని నిన్న సాయంత్రం శాసనసభ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పంచాయతీ రాజ్ బిల్లుకు ఆమోదం తెలిపారు.అయితే, రాఘవ కన్ స్ట్రక్షన్ వ్యవహారంలో హౌస్ కమిటీ విచారణకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. అనంతరం సభలో కాసేపు గందరగోళం నెలకొన్నది. మంత్రి పొంగులేటిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.అక్రమ మైనింగ్ చేస్తూ మంత్రి పొంగులేటి కోట్లు గడిస్తున్నారని, అందులో సీఎం రేవంత్ రెడ్డి షేర్ ఉంది కాబట్టే ఆయన్ను ఏమీ అనడం లేదని, వెనకేసుకొస్తున్నారని కేటీఆర్, హరీశ్ రావులు ఆరోపిస్తున్నారు. కాగా, సభలో హరీశ్, కేటీఆర్ వ్యవహారంపై స్పీకర్ సీరియస్ అయ్యారు.
బీఆర్ఎస్ నేతలు ప్రజాసమస్యలను గాలికి వదిలేసి ఔట్ ఆఫ్ ది బాక్స్ విషయంపై సభలో రచ్చ చేస్తున్నారని, అసలు రాఘవ కన్ స్ట్రక్షన్కు మంత్రి పొంగులేటికి సంబంధం ఏంటని సీఎం రేవంత్ నిన్న అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. గత పదేండ్లుగా అక్రమ మైనింగ్కు పాల్పడిన వారిలో గులాబీ నేతలే చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. అక్రమ మైనింగ్ మీద విచారణకు బీఆర్ఎస్ పట్టుబడుతున్న తరుణంలో గత పదేండ్ల మైనింగ్ లెక్కలు తీస్తామని సీఎం ప్రకటించారు. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. అంతేకానీ, ఆధారాలు లేకుండా సత్యదూర ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
కేటీఆర్ చేసిన పనికి ఆ రోజు మూసుకొని కూర్చున్న.. దానం ఆవేదన
సభలో బీఆర్ఎస్ నేతల తీరుపై అటు స్పీకర్తో పాటే మంత్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. చర్చ జరపాల్సి పోయి ఇలా గందరగోళం సృష్టించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. హౌస్ కమిటీ మీద స్పీకర్ క్లారిటీ ఇవ్వకపోవడంతో వారంతా వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం గన్ పార్క్ వద్ద రాఘవ కన్ స్ట్రక్షన్తో మంత్రి పొంగులేటికి సంబంధం ఉందని, లేకపోతే విచారణ కమిటీ వేయడానికి భయం ఎందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎంకు కూడా అందులో వాటా ఉందని అందుకే విచారణకు వెనుకాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని సహజ వనరులను అక్రమ మైనింగ్ పేరిటనాశనం చేస్తున్నారని, కోట్లు దండుకుంటున్నారని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, సభా సమయాన్ని వృథాచేయడంపై బీఆర్ఎస్ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.