BRS Protest: ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రిలు అంటూ ప్ల కార్డ్స్ ప్రదర్శించారు. అక్కడి నుంచి గన్ పార్కు నుంచి ర్యాలీగా అసెంబ్లీలోని ఎంట్రీ దగ్గరకు చేరుకొని నిరసన తెలిపారు.
శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో రాక అనేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు. 12 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన అత్యంత ప్రాధాన్యత కలిగిన ఫీజు రీయింబర్స్ మెంట్ కేసీఆర్ కొనసాగించారన్నారు. విద్యార్థుల బంగారు బాటకు కేసీఆర్ మార్గం చూయిస్తే, ఈ ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువుకు దూరం చేస్తుందన్నారు. ఇప్పటికైనా సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.