సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున గంజాయి రవాణాను అడ్డుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో సీసీఎస్, ఎస్ న్యాబ్, సదాశివపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సదాశివపేట నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఒక కియా కారును మార్గమధ్యంలో ఆపారు. ఆ కారును తనిఖీ చేయగా గంజాయి ముఠా గుట్టు రట్టయింది. కియా కారు వెనుక వస్తున్న ఒక డీసీఎం వాహనంలో భారీగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు.
పోలీసులు ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డీసీఎం లోపల ప్యాకెట్ల రూపంలో భద్రపరిచిన ఎండు గంజాయి లభ్యమైంది. మొత్తం 286 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 574 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 2.87 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన కియా కారు, డీసీఎం వాహనాన్ని ఘటనా స్థలంలోనే సీజ్ చేశారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులంతా మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కియా కారును పైలట్ వాహనంగా వాడుతూ పోలీసుల కళ్లుగప్పి గంజాయి తరలించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ సరుకు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల కదలికలపై నిఘా పెంచినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ALSO READ: Telangana Cabinet: జీహెచ్ఎంసీ స్థానంలో సరికొత్త అర్బన్ చట్టం.. రేవంత్ సర్కార్ కీలక అడుగు