Harish Rao: పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య రుణం కోసం బ్యాంకులో తన ఇంటిని తాకట్టు పెట్టారు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తన నియోజకవర్గానికి చెందిన మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చినా ట్యూషన్ ఫీజులకు ప్రతీ ఏటా రూ. 7.50 లక్షలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం తెలిపింది. అయితే విద్యార్థిని బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ నెల 18న ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును కోల్పోయే పరిస్థితి నెలకొంది. విద్యార్థిని మమత, ఆమె తండ్రి కొంక రామచంద్రం ద్వారా విషయం తెలుసుకున్న హరీశ్ రావు వెంటనే స్పందించారు.
సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రూ. 20 లక్షల ఎడ్యూకేషన్ లోన్ మంజూరు చేయించారు హరీశ్ రావు. హాస్టల్ ఫీజు కోసం రూ.లక్ష ఇచ్చారు. నాడు ఆటో కార్మికుల కోసం, నేడు నిరుపేద విద్యార్థిని చదువు కోసం తన ఇంటిని తనఖా పెట్టారు హరీశ్ రావు.
తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి టైలరింగ్ చేస్తూ తనను ఎంబీబీఎస్ వరకు చదివించారని మమత తెలిపారు. అహర్నిశలు శ్రమించి పీజీ ఎంట్రన్స్ లో సీటు సాధించానని సంతోష పడ్డానన్నారు. ఉచితంగానే సీటు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.7.50 లక్షల చొప్పున మూడేళ్లు రూ.22.50 లక్షలు కట్టాలని చెప్పడంతో ఇక సీటు దక్కదని బాధపడ్డానన్నారు.
‘తనతో పాటు తన చెల్లెళ్లకు ఎంబీబీఎస్ చదవడానికి హరీశ్ రావు సార్ హెల్ప్ చేశారు. కానీ ఇది పెద్ద విషయం కావడంతో సార్ చేస్తారో..లేదో అని టెన్షన్ పడ్డాము . మేము అడగడమే ఆలస్యం.. తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి చెప్పారు. చదువు విలువ, నిరుపేద విద్యార్థులు పడే ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలిసిన హరీశ్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టం’ – విద్యార్థిని మమత
తన బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ కన్వీనర్ కోటాలో సీటు సంపాదించినప్పటికీ ఆర్థిక స్తోమత లేక ట్యూషన్ ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదని విద్యార్థిని మమత తండ్రి అన్నారు. తాము చేసిన ప్రయత్నాలకు అన్ని దారులు మూసుకుపోయాయని, కానీ ఆపద వచ్చినవారి కోసం నిరంతరం తన ఇంటి తలుపులు తెరిచి ఉంచే హరీశ్ రావు ఏకంగా తన ఇంటిని మాకోసం తాకట్టు పెడతాడని కలలో కూడా ఊహించలేదన్నారు. తన నలుగురు బిడ్డలు హరీశ్ రావు స్ఫూర్తితోనే, ఆయన చేసిన సహాయంతోనే ఎంబీబీఎస్ వైద్య విద్య చదువుతున్నారన్నారు.
Also Read: Ponguleti Srinivas Reddy: రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశ: మంత్రి పొంగులేటి
పెద్ద బిడ్డ ప్రస్తుతం పీజీ సీటు దక్కించుకోగా.. రెండో అమ్మాయి ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తుందన్నారు. మరో ఇద్దరు అమ్మాయిలు జగిత్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 3 లక్షల మందిలో తాము ఒకరం. అంతే తప్ప మరెలాంటి సంబంధం లేదన్నారు. తన కూతురి భవిష్యత్తు కోసం ఒక్క క్షణం ఆలోచించకుండా హరీశ్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టారని అన్నారు.