Ponguleti Srinivas Reddy: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కేవలం రెండేళ్ల పాలనలోనే.. తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైన కొత్త దిశను చూపించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలు కోరుకున్న మార్పును మాటల్లోనే కాదు, పనిలోనూ చూపించామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ, మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లిలోని మీడియా అకాడమీలో జిల్లా ప్రజా సంబంధాల అధికారుల కోసం నిర్వహించిన పునశ్చరణ తరగతులకు శుక్రవారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పనితీరు, ప్రజా సంబంధాల అధికారుల పాత్ర, ఆధునిక ప్రచార విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. మేం అధికారం చేపట్టే సమయానికి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఆర్థిక పరిస్థితి, పరిపాలన వ్యవస్థ, ప్రజల నమ్మకం అన్నీ సవాళ్ల మధ్యనే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చి, అభివృద్ధి, సంక్షేమాల దిశగా పరుగులు పెట్టిస్తున్నాం అని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా.. పేదవాడిని కేంద్రంగా చేసుకుని పాలన సాగుతోందని మంత్రి చెప్పారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెడుతున్నాయని అన్నారు.
అయితే ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో.. ప్రజల్లోకి చేరడం లేదన్న ఆందోళనను మంత్రి వ్యక్తం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన ప్రజా సంబంధాల అధికారుల పాత్ర మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేయాలని ఆదేశించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పనితీరులో కూడా మార్పు రావాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు డిజిటల్, సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. వేగంగా విస్తరిస్తున్న సోషల్ మీడియా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి శక్తివంతమైన సాధనమని, దాన్ని సమగ్రంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి జిల్లాకు సమర్థవంతమైన జిల్లా ప్రజా సంబంధాల అధికారులను నియమించాలని, ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్పై పనిచేస్తున్నవారిని తిరిగి పంపించాలని, అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఐ అండ్ పీఆర్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వ విజయబాబు, ఐ&పీఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీఎం సీపీఆర్వో జి. మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదే సందర్భంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంలో.. వెలువడిన తెలంగాణ మాస పత్రిక ప్రత్యేక సంచికను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక సంచిక ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబిస్తుందని మంత్రి తెలిపారు.
Also Read: తెలంగాణను క్రీడా హబ్గా మారుస్తాం.. ఒలింపిక్సే మా లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహరి
రెండేళ్ల పాలనలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తెలంగాణను అభివృద్ధి, సంక్షేమాల దిశగా తీసుకెళ్లిన ప్రజా ప్రభుత్వ ప్రయాణంలో, ప్రజా సంబంధాల వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు.