తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు మాస్ లీడర్గా పేరుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ కాకతీయ పేరుతో చెరువుల తవ్వకం, పూడిక తీత, ఎత్తిపోతల పథకాలను పెద్దఎత్తున చేపట్టారు. ముఖ్యంగా సాగు, తాగు నీటి ప్రాజెక్టులు హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో పరుగులు పెట్టాయని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పేర్లు మార్మోగాయి.
తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన తొలి టర్ములో వచ్చిన ప్రతిఎన్నికల్లో హరీశ్ రావు ముందుండి అభ్యర్థులను గెలిపించారు. పార్టీ నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు, అసంతృప్తులను ఆయన తనదైన శైలిలో చక్కదిద్దేవారు. స్థానిక ఎన్నికలను ఒంటి చేత్తో గెలిపించిన రోజులు ఉన్నాయి. దీంతో ఆయనకు ట్రబుల్ షూటర్ అనే పేరొచ్చింది. ఇదంతా కేసీఆర్ ముఖ్యమంత్రిగా మొదటి టర్మ్ పూర్తి చేసుకునేంత వరకే.. అయితే, హరీశ్ రావు మంత్రిగా కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కీలక భూమిక పోషించారు. చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి.ఒకానొక సమయంలో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాతే హరీశ్ రావే అన్న పేరు కూడా వినిపించేది.
కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యాక హరీశ్ రావు ఫేమ్ ఒక్కసారిగా మసకబారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా స్కామ్ జరిగిందని, అందులో కీ రోల్ హరీశ్ రావుదే అని అప్పట్లోనే పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయం తెలిసే కేసీఆర్..రెండో టర్ములో మంత్రి పదవి ఇవ్వకుండా ఆరు నెలలు పాటు వెయిట్ చేయించారని, ఆ సమయంలో హరీశ్ రావు కన్నీళ్లు పెట్టుకున్నాడని గతంలోనే ప్రస్తుత మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరోసారి మంత్రి పదవి దక్కినా.. పార్టీలో హరీశ్ రావు సెకండ్ పొజిషన్ను కేటీఆర్ లాక్కున్నారని కథనాలు సైతం వచ్చాయి. కొన్నాళ్లకు వచ్చిన అన్ని బై ఎలక్షన్స్లో హరీశ్ రావు సత్తా చాటలేకపోయారు. ఆ టైంలో ఆయనకున్న ట్రబుల్ షూటర్ పేరు కూడా మసకబారింది.
The Paradise Release Update: సెంటిమెంట్ యాక్షన్ డ్రామాగా నాని ది ప్యారడైజ్… మార్చిలో రానట్టేనా?
మొన్నటివరకు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా హరీశ్ రావును సిట్ విచారించింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఆయన ప్రమేయం ఉందని ఓ న్యూస్ చానెల్ ఎండీ శ్రవణ్ రావు.. స్టేట్మెంట్ ఆధారంగా హరీశ్ రావును సిట్ అధికారులు విచారించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. అసలు ఈ రెండు కేసుల్లో హరీశ్ రావు ప్రమేయం నిజంగా ఉన్నదా? అంటే విచారణ బృందాలే తేల్చాలి.కాళేశ్వరం ప్రాజెక్టులో నాటి నీటిపారుదల శాఖా మంత్రిగా ఆయన నిర్ణయం తప్పక ఉండి ఉంటుందని చర్చ జరుగుతున్న వేళ.. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఆయన ప్రమేయం నిజంగానే ఉందా? అనే చర్చ సైతం జరుగుతున్నది. ఈ రెండు కేసుల్లో హరీశ్ రావు విలనా? లేక విక్టిమా? అనేది తెలియాల్సి ఉన్నది. కాగా, బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలే అని.. రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శలు చేస్తున్నారు.