ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహాకుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ముహూర్తం ఖరారైంది. నేడు నిర్వహించిన మండెమెలిగే పూజలతో ఈ చారిత్రాత్మక జాతరకు అధికారికంగా అంకురార్పణ జరిగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు కోట్లాదిగా తరలివచ్చే ఈ మహా వేడుకకు సంబంధించి గిరిజన సంప్రదాయం ప్రకారం ఆదివాసీ పూజారులు తొలి పూజలు నిర్వహించారు.
ఆలయాల శుద్ధి – సంప్రదాయ వేడుక..
జాతర ప్రారంభోత్సవంలో భాగంగా మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాలను పూజారులు శాస్త్రోక్తంగా శుద్ధి చేశారు. తెల్లవారుజామునే పూజారులు తమ కుటుంబ సమేతంగా డోలు వాయిద్యాల నడుమ నదీజలాలను తీసుకువచ్చి గర్భాలయాలను కడిగారు. అనంతరం ఆలయ ప్రాంగణాలను మామిడాకులు, గుమ్మడికాయలు, ఎర్ర మిరపకాయలతో అలంకరించి, దిష్టి తగలకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రామ దేవతలకు ధూప, దీప నైవేద్యాలు సమర్పించి, జాతర విజయవంతంగా జరగాలని ప్రార్థించారు.
గ్రామ అష్టదిగ్బంధనం..
వనదేవతలు కొలువైన మేడారం గ్రామానికి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా, భక్తులకు ఆపదలు కలగకుండా పూజారులు అష్టదిగ్బంధన తంతును నిర్వహించారు. గ్రామం చుట్టూ దిష్టి తోరణాలు కట్టి, రక్షణ కవచంలా మంత్రోచ్ఛారణలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ అష్టదిగ్బంధనం జరిగిన తర్వాత జాతర పూర్తయ్యే వరకు గ్రామంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించవని ఆదివాసీల ప్రగాఢ విశ్వాసం.
వనదేవతల జాగారం..
మండెమెలిగే పూజల అనంతరం రాత్రి వేళ వనదేవతల గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించనున్నారు. రాత్రంతా గద్దెల వద్దే ఉండి జాగారాలు చేస్తూ అమ్మవార్లను స్మరించుకుంటారు. ఈ క్రతువుతో మేడారం పరిసర ప్రాంతాల్లో జాతర వాతావరణం పూర్తిగా సంతరించుకుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి భక్తులు భారీగా మేడారానికి చేరుకుంటున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రవాణా, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు వచ్చే నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగనున్నాయి.