BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. తన చిన్న కుమారుడు పరీక్షల నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ మధ్యంతర బెయిల్ పై విచారణను ధర్మాసనం ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.
కవిత తరఫున వాదనలు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ రౌస్ అవెన్యూ కోర్టులో వినిపించారు. మధ్యంతర బెయిల్ తో పాటుగా.. రెగ్యులర్ బెయిల్ కూడా కావాలని సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు, ఈడీ రిప్లై రీజాయిండర్ కోసం సింఘ్వీ కోర్టులో సమయం కోరారు. ఈనెల 3వ తేదీనా కవిత తరఫు న్యాయవాది కోర్టులో రీజాయిండర్ ను దాఖలు చేయనున్నారు.
కవిత తరఫు న్యాయవాది కోర్టులో కొన్ని అనుమతులు కోరగా.. ధర్మాసనం వాటిని అంగీకరించింది. తీహార్ జైల్లో ఉన్న కవితకు ఇంటి భోజనం, బుక్స్, మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల, షూ ధరించేందుకు కోర్టు అనుమతులు మంజూరు చేసింది. అయితే లిక్కర్ కేసులో భాగంగా కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో భాగంగా కవిత భర్త అనిల్ కోర్టుకు నేరుగా హాజరయ్యారు. ప్రస్తుతం లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.