బీఆర్ఎస్ పార్టీలో కొత్త సంవత్సరం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో సీనియర్లు చాలా వరకు అసంతృప్తితో ఉన్నట్టు ఆ పార్టీలోనూ చర్చ జరుగుతున్నది. పార్టీలో దక్కిన వారికే మళ్లీ మళ్లీ ప్రాధాన్యత లభిస్తున్నదని, తమకు అవకాశం ఇవ్వడం లేదని కొందరు బీసీ నేతలు, కిందిస్థాయి నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో జిల్లాల పర్యటనలకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..గ్రామస్థాయిలో కమిటీలు వేస్తామని చెప్పారు. దానిపై ఇంతవరకూ అడుగు ముందుకు పడలేదు. ఈసారైనా తమకు పార్టీ స్థాయిలో పదవులు దక్కుతాయని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు పార్టీలో దక్కిన పెద్దపెద్ద పదవులు సైతం గులాబీ బాస్ కేసీఆర్కు సన్నిహితంగా ఉన్నవారికే దక్కాయి. ఆ తర్వాత చిన్నబాస్ కేటీఆర్.. హరీశ్ రావు సన్నిహితులకు ప్రాధాన్య పోస్టుల్లో ఉన్నారు. బీసీ నేతలు, కింది స్థాయి నేతలు కేసీఆర్,కేటీఆర్ను పదవుల విషయంలో కలిసి మాట్లాడుదామనుకుంటే వారి చుట్టూ ఉండే కోటరీ వారిని కలువనివ్వకుండా చేస్తున్నదని టాక్ ఉంది. అందువల్లే చాలా మంది నిరాశతో ఉన్నట్టు తెలుస్తున్నది.మున్ముందు కూడా ఇలానే ఉంటే తమ భవిష్యత్ అంధకారమే అని వారు ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ మారుదామా? అని తమ అనుచరులతో చర్చలు జరుపుతున్నట్టు సైతం ప్రచారం జరుగుతోంది.
KTR: మా అయ్య మొగోడు.. మొనగాడు.. రేవంత్కు కేటీఆర్ కౌంటర్
గత పదేండ్లు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారంతా అధికారం దూరం కాగానే తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు అధికార పార్టీలోకి వెళ్లారు.ఇదే విషయాన్ని పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్లు గుర్తుచేస్తున్నారు. తమకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము పార్టీని వీడలేదని, పైగా సొంత డబ్బులు పెట్టుకున్నామని వాపోతున్నారు. వ్యాపారాలు కాపాడుకునే వారికి ప్రాధాన్యత ఇస్తే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారంతా ఇప్పుడు ఎక్కడ పోయారని ఎమ్మెల్యేలను నిలదీస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని గులాబీ బాస్ వద్దకు తీసుకెళ్లి తమ భవిష్యత్కు భరోసా ఇస్తేనే తాము ఆగుతామని, లేదంటే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు అల్టీమేటం జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఈ విషయం ప్రస్తుతం గులాబీ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై రెండేండ్లు పూర్తయింది. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అంచనా వేసి పోస్టుమార్టం చేయాల్సిన పెద్దలు ఇప్పటివరకు దృష్టి సారించలేదు. గ్రామాల్లో నేటికి పార్టీకి ఆదరణ తగ్గలేదని చెబుతున్న గులాబీ పెద్దలు.. మరి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని అక్కడ మార్పులు చేర్పులు చేయాలని.. అలా చేస్తే తమకు పదవులు దక్కుతాయని బీసీలు, ఎస్సీ,ఎస్టీల నుంచి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నట్లు సమాచారం.ఇటీవల తెలంగాణ భవన్కు విచ్చేసిన కేసీఆర్ సైతం గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు వేస్తామని ప్రకటించారు. ఆ ప్రక్రియను త్వరగా ప్రారంభిస్తే సీనియర్లు, కింది స్థాయి నేతలు పక్క చూపులు చూడరని గులాబీ పెద్దలకు ఎమ్మెల్యేలు, మాజీలు సూచిస్తున్నారు. లేదంటే భవిష్యత్ మీద భయంతో వారు వెళ్లిపోతే పార్టీ మరింత కష్టాల్లో పడుతుందని, అసలే ఈ ఏడాది మున్సిపల్, ఎంపీటీసీ,జెట్పీటీసీ, గ్రేటర్ ఎన్నికలు ఉన్నందున ఆలస్యం చేయొద్దని సూచించినట్లు టాక్ వినిపిస్తోంది.