అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై మంగళవారం చర్చను ప్రారంభించగా.. బీఆర్ఎస్ పార్టీ నేతలు మధ్యలో అడ్డు తగిలారు. గవర్నర్ ప్రసంగంలో అసలైన అంశాలు ప్రస్తావించలేదని, కేవలం ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివారని వాదించారు.ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు రూ.2500, తులం బంగారం, మూసీ సుందరీకరణ పేరిట విధ్వంసం, హైడ్రా కూల్చివేతలపై ఎందుకు మాట్లాడించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు కౌంటర్లు ఇచ్చారు.
సభలో చర్చ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు రూ.57 వేల కోట్ల రుణాలు ఇప్పటివరకు మంజూరు చేశామని ఆర్థికశాఖమంత్రి భట్టి విక్రమార్క పేర్కొనగా.. దీనిపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒకవేళ అదే నిజమైతే ప్రభుత్వ ఆర్డర్ కాపీని చూపించాలని, అలా చూపిస్తే తాను ఇప్పుడే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆర్డర్ కాపీని చూపించకపోయినా, ఆ లెక్కలు తప్పని తేలితే డిప్యూటీ సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా భట్టి విక్రమార్క రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.కాగా, దీనిపై డిప్యూటీ సీఎం భట్టి, కేటీఆర్ మధ్య పెద్దఎత్తున వాదోపవాదనలు నడిచాయి.కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని భట్టి ఫైర్ అయ్యారు.
మరోవైపు మహిళా సాధికారత అంశంలో మాజీ మంత్రి కేటీఆర్కు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత లేదని, వారి హయాంలో మహిళా రుణాలు సైతం సరిగా ఇవ్వలేదని, వారికి పదవులు సైతం కేటాయించలేదని మంత్రి మండిపడ్డారు.అటువంటి వ్యక్తి మహిళా సాధికారతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏంటని ఆమె ఫైర్ అయ్యారు. గులాబీ పార్టీలో డ్రగ్స్ తీసుకునే నాయకులు ఉన్నారని, దానిపై ఆయన ముందు స్పందించాలని సీతక్క సవాల్ విసిరారు. యువతకు ఆ పార్టీ నేతలు ఏం సందేశం ఇస్తున్నారని విరుచుకపడ్డారు. ముందుగా గులాబీ పార్టీ నేతలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని సభలో ప్రశ్నించారు.
AC Repair Tips: ఏసీ నుంచి వచ్చే ఈ 5 శబ్దాలను నిర్లక్ష్యం చేస్తే.. కంప్రెషర్ పేలిపోతుంది జాగ్రత్త!
ఇదిలాఉండగా, బీఆర్ఎస్ పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని తానే ఇరుకున్నదని చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నించి, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీ తీరును ఎండగట్టాలని భావించినా.. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఆ పార్టీపై నెగెటివ్ ఇంపాక్ట్ ఏర్పడింది. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలు ఇప్పుడు అధికార పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయాయని ప్రచారం జరుగుతోంది.ఈసారి సెషన్స్లో అప్పర్ హ్యాండ్ సాధించాలనుకున్న బీఆర్ఎస్ పార్టీకి.. పైలెట్ రోహిత్ రెడ్డి రూపంలో యార్కర్ ఎదురైందని, తద్వారా ఆ పార్టీ డక్కౌట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీరియస్ కావడం చర్చనీయాంశంగా మారింది.