Illegal Constructions: స్వేచ్ఛ, బ్యూరో: నగర పరిధులు విస్తరిస్తున్న కొద్దీ అక్రమ నిర్మాణాలు కూడా అదే వేగంతో పెరుగుతున్నాయి. ముఖ్యంగా మేడ్చల్ GHMC పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్లోని మైసమ్మగూడ ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధనలు పక్కనబెట్టి నిర్మాణాలు జరుగుతున్నా, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎవరూ అడ్డుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మైసమ్మగూడలో అనేక భవనాలు అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మితమవుతున్నాయి. సెట్బ్యాక్లు పాటించకపోవడం, రోడ్లను ఆక్రమించడం, అదనపు అంతస్తులు నిర్మించడం వంటిఉల్లంఘనలుబహిరంగంగాకనిపిస్తున్నాయి. అయినప్పటికీ, పరిశీలన చేయాల్సిన అధికారులు మాత్రం కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యతను విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి
సాధారణ ప్రజలు చిన్నపాటి మార్పులు చేసినా వెంటనే నోటీసులు జారీ చేసే అధికారులు, పెద్ద స్థాయిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మాత్రం మౌనం వహిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. డబ్బు, రాజకీయ ప్రభావం ఉన్నవారికి అధికారులు మద్దతుగా నిలుస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అక్రమ నిర్మాణాల వల్ల కాలనీలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. రోడ్లు ఇరుకుగా మారడంతో వాహనాలు సరిగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా దెబ్బతిని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే ప్రమాదం పెరిగింది. భవిష్యత్తులో అగ్నిప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు చేపట్టడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, కేవలం చూపుదానికే తనిఖీలు జరుగుతున్నాయే గానీ, కఠిన చర్యలు మాత్రం కనిపించడంలేదని చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.
ఇప్పటికైనా GHMC అధికారులు మేల్కొని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈ సమస్య మరింత పెరిగి భవిష్యత్తులో నగర అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మేడ్చల్ GHMC డిప్యూటీ కమిషనర్ సుధాంష్ అక్రమ నిర్మాణాలపై వివరణ కోరగా మైసమ్మగూడ ప్రాంతంలో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై కూడా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.