BRS Strategy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ, మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఈ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ (గులాబీ) అధిష్టానం భావిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టిన తరహాలోనే, తెలంగాణలోనూ తమను ఇరుకున పెట్టేందుకు ‘ఢిల్లీ పార్టీలు’ ప్రయత్నిస్తున్నాయని గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. ఈ ‘బెంగాల్ తరహా’ రాజకీయ ముప్పును తిప్పికొట్టేందుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కేటీఆర్, హరీష్ రావును నిత్యం ప్రజల మధ్యలో ఉండేలా సూచనలు చేసినట్లు సమాచారం. మీడియా ముందే కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజాసమస్యలపై పోరుబాటపట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన కమ్యూనిస్టులు, ఆ తర్వాత తృణమూల్ హవాలో ఎలా కనుమరుగయ్యారో.. తెలంగాణలోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుందా? అనే సందేహాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తమవుతున్నాయి. ఈ ‘బెంగాల్ సెంటిమెంట్’ గులాబీ శ్రేణులను కలవరపెడుతుండటంతో, పార్టీ అధినేత కేసీఆర్ అప్రమత్తమై జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ధీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం.
పార్టీ ఉనికిని చాటుకోవడమే కాకుండా, క్యాడర్లో భరోసా నింపేందుకు అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో బలోపేతం కావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు సిద్దమైనట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై లోతైన విశ్లేషణ, కేడర్ తో ముఖాముఖీ నిర్వహిస్తూ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూనే, భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ వైఫల్యాలను మరింతగా ఎత్తిచూపేందుకు గులాబీ సిద్ధమవుతుంది.
సమన్వయ లోపం సరిదిద్దబోతున్నారు. ప్రతి సెగ్మెంట్లో అసంతృప్త నేతలను బుజ్జగించి, అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నంచేయబోతున్నారు. గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికేలా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. కార్యకర్తలకు భరోసా కల్పించడం కోసం ముఖ్య నేతలు స్వయంగా గ్రామాలకు వెళ్లనున్నట్లు సమాచారం. కేడర్ తో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ అధినేత నేతలకు సూచనలు ఇచ్చినట్లు తెలిసింది.
Also Read: Manasa Varanasi : పట్టు లంగావోణీలో మెరిసిపోతున్న మానస.. కుర్రాళ్ళు తట్టుకోలేరు..!
వ్యూహరచనలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను అధినేత కేసీఆర్ పూర్తిస్థాయిలో రంగంలోకి దించినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా, జిల్లాల్లో పర్యటించి కేడర్లో ధైర్యం నింపాలని ఆదేశించినట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో యువతను, మేధావులను ఆకర్షించే బాధ్యతతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టే బాధ్యతను కేటీఆర్ కు అప్పగించినట్లు సమాచారం. ఎప్పటిలాగే పార్టీకి ‘ట్రబుల్ షూటర్’గా ఉంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు కోల్పోకుండా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉండేలా హరీష్ రావుకు సూచనలు చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ వైఫల్యాలే ఆయుధాలుగా చేసుకోవాలని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని గులాబీ దళపతి ఆదేశించినట్లు సమాచారం.రైతులకు ఇచ్చిన వాగ్దానాల అమలులో వైఫల్యాలను ఎండగట్టడం, మహిళా గ్యారెంటీలు, రూ. 2500 భృతి వంటి అంశాలపై నిలదీయడం, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, బోనస్, విద్యుత్ కోతలు, సాగునీటి ఎద్దడిపై గళం ఎత్తి ప్రజల పక్షాన నిలబడటం, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి, తదితర అంశాలపై దూకుడు పెంచాలని సూచనలు చేసినట్లు సమాచారం.”ఇకపై రక్షణత్మక ధోరణి వీడాలి. ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరించాలి. ప్రతి వైఫల్యాన్ని ఎండగడుతూ జాతీయ పార్టీల వైఖరిని ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచనలు చేసినట్లు సమాచారం.
ఓటమి నేర్పిన పాఠాలతో, బెంగాల్ తరహా పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రజల్లోనే ఉండాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఈ మేరకు రాబోయే రోజుల్లో పోరాటాల పంథాను మార్చుకుని, మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయబోతున్నట్లు సమాచారం.ప్రజల సమస్యలపై మౌనంగా ఉండకుండా, ప్రతి చిన్న సమస్యపై ‘గళం ఎత్తాలని’ క్షేత్రస్థాయి నాయకులకు సైతం స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. ధర్నాలు, రాస్తారోకోలు, వినూత్న నిరసనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, ప్రజల్లో తమ పట్టు కోల్పోకుండా చూసుకోవడమే లక్ష్యంగా గులాబీ దళం కదులుతోంది. జాతీయ పార్టీల దూకుడుకు ప్రాంతీయ సెంటిమెంట్ను తోడు చేసి ‘తెలంగాణ గొంతుక’గా మళ్లీ నిలబడాలనేదే కేసీఆర్ ప్లాన్. మరోవైపు కొత్త రాజకీయ పార్టీలకు సైతం తెలంగాణలో అవకాశం లేదని నిరూపించాలని వ్యూహంలో ఒక భాగమని.. అందుకే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి చర్యలు ముమ్మరంచేయబోతున్నట్లు సమాచారం.
Also Read: విమానంలో మహువాకు వేధింపులు.. టీఎంసీ చోర్ చోర్ అంటూ నినాదాలు, వీడియో బయటపెట్టిన ఎంపీ