గులాబీ బాస్ ఇలా బయటకు వచ్చారో లేదో ఆ పార్టీలో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. మొన్నటివరకు యాక్టివ్గా లేని వారంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందో? ప్రజా ఉద్యమం అన్నారు.. దానిగురించి అప్డేట్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.దీనికి తోడు మరోవైపు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సాగుతున్నది. పాత సిట్ స్థానంలో కొత్త సిట్ ఏర్పాటైంది. ఒక నెలలోనే విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం సిట్ బృందానికి డెడ్ లైన్ విధించింది. దీంతో తమ పేరు ఎక్కడ వస్తుందోనేమో అని కొందరు సీనియర్ లీడర్లు హడలెత్తిపోతున్నారు. దీంతో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్కు గులాబీ సీనియర్లు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం గులాబీ పార్టీలో ఒకింత భయం..ఒకింత ఉత్సాహం కనిపిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నేరుగా ఇన్వాల్వ్ అయ్యారో వారిలో నీరసం, గుబులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక మిగతా లీడర్లు మాత్రం గులాబీ బాస్ వస్తున్నారని తెలిసి వారిలో జవసత్వాలు వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.అదే జోష్లో ప్రభుత్వాన్ని ఢీ కొడతామా? ప్రజా ఉద్యమానికి సిద్ధం అవుదామని కొందరు నేతల మధ్య చర్చ కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్ నేడు మరోసారి బీఆర్ఎస్ కీలక నేతలతో తెలంగాణ భవన్లో భేటీ కానున్నారని సమాచారం. 15 రోజుల్లో మూడు సభలు నిర్వహిస్తానని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు.
రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో మూడు సభలు నిర్వహిస్తానని కేసీఆర్ ముందుగా ప్రకటించడంతో అక్కడ ఏ రోజుల్లో సభను నిర్వహించాలి? ప్రజలను ఎలా అక్కడకు తీసుకుని రావాలి? కృష్ణ నదీ పారే ఈ మూడు జిల్లాల ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా నష్టం చేస్తున్నదో వివరించేందుకు తగిన సన్నాహాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే కేటీఆర్, హరీశ్ రావులకు ఈ సభలను విజయవంతం చేసే బాధత్యలను పెద్దాయన అప్పగిస్తారని తెలుస్తున్నది. వీరు జిల్లా నేతలను కో ఆర్డినేట్ చేసుకుని జనసమీకరణ చేపడతారని టాక్.
ఇదిలాఉంటే, కేటీఆర్, హరీశ్ రావు, మరికొందరు నేతలతో ఎర్రవల్లిలో కేసీఆర్తో రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ బృందం దూకుడు పెంచడంతో వారంతా భేటీ అయినట్టు సమాచారం. ఇప్పటికే ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో భాగంగా హరీశ్ రావు పేరు ప్రస్తావించినట్టు టాక్ విపిస్తున్నది. ఆ తర్వాత కేటీఆర్, కేసీఆర్ పేర్లు సైతం రావొచ్చని..వారికి సిట్ త్వరలోనే నోటీసులు ఇచ్చే ఆస్కారం ఉందని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే విచారణకు హాజరైతే ఎలా బదులివ్వాలనే అంశంపై వీరు సీక్రెట్గా భేటీ అయి ఉంటారని టాక్. అయితే, ప్రభుత్వం తమ మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని గులాబీ అధినేత సభల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ సైతం ఇప్పటికే ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ కార్ రేసు విషయంలో అరెస్టు చేస్తే చేసుకోండి అని మండిపడ్డారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో హరీశ్ రావు పేరు రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేసీఆర్కు కాళేశ్వరం అంశం నిద్రపోనివ్వడం లేదని తెలుస్తున్నది. అందుకే గులాబీ బాస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేందుకు ఎర్రవల్లి వేదికగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. కేసుల విషయంలో భయపడేది లేదని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని ఇప్పటికే గులాబీ బాస్ వారికి ధైర్యం చెప్పినట్టు తెలుస్తున్నది.