బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలకు ముందు ఆ పార్టీ కీలక నేతలపై కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసులు నమోదైనట్టు తెలుస్తున్నది. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా మాజీ సీఎం కేసీఆర్ అని నివేదిక తేల్చింది. ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు కేసీఆర్ను అరెస్టు చేస్తారా? అన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ, అరెస్టు జరగకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కూలడానికి ప్రధాన కారణం గులాబీబాస్ అనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఫలితంగా ప్రజలు అంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తాజాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పీఎస్లో నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా ఓ న్యూస్ మీడియా చానెల్ ఎండీ శ్రవణ్ రావు సిట్ ఎదుట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేరు ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ మేరకు సిట్ అధికారులు విచారణ పేరుతో ముందుగా తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్కు నోటీసు అందజేసింది. సిట్ పిలుపు మేరకు హరీశ్ రావు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు హాజరై బయటకు వచ్చారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సైతం సిట్ బృందం నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని నందినగర్లో గల ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అందజేశారు. విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకున్నది. ముందుగా బావకు, ఆ తర్వాత బావమరిదికి సిట్ బృందం నోటీసులు పంపింది.దీనిపై నిన్న రాత్రి స్పందించిన కేటీఆర్.. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేకపోవడంతో ప్రజలు ఎక్కడ తిరగబడతారో అన్న భయంతో సిట్ నోటీసుల పేరిట సీఎం రేవంత్ డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారని విమర్శించారు. నోటీసులు అందుకున్న కేటీఆర్.. శుక్రవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. 2023 ఎన్నికలకు ముందు సిరిసిల్లలో వార్ రూం ఉద్దేశం ఏమిటి? ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్ డేటా ధ్వంసం వెనుక ఎవరున్నారు? గత ఎన్నికల ముందు గులాబీ పార్టీకి ఫండ్ ఎంత వచ్చింది? అని డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి కేటీఆర్ విచారించినట్టు తెలుస్తున్నది.
Vivek: చిత్తు చిత్తుగా ఓడించాం.. అయినా కేటీఆర్ బుద్ధి మారడం లేదు, మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు
హరీశ్ రావు అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు రావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకున్నది. విచారణకు వెళ్లే కంటే ముందు కేటీఆర్, హరీశ్ రావులు ఫాంహౌస్లో కేసీఆర్ను కలిసి సమాలోచనలు చేసినట్టు తెలుస్తున్నది.ఫోన్ ట్యాపింగ్ మీద ఎలా ముందుకు వెళ్లాలి? అందరూ ఒకే సమాధానం చెప్పాలి? సిట్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేకపోతే మౌనంగా ఉండాలని,తమకు ఏమీ తెలియదని చెప్పాలని గులాబీ బాస్ సొంత పార్టీ నేతలకు అండగా నిలిచినట్టు ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల ఎదుట పార్టీలో కీలక నేతలుగా ఉన్న హరీశ్ రావు, కేటీఆర్లను అరెస్టు చేస్తే ఆ పార్టీకి నెగెటివ్ ప్రచారం కామన్. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం, అక్రమాలు, అవినీతిపై కాంగ్రెస్ పెద్దఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి గులాబీ పార్టీ నేతలపై తీవ్ర వ్యతిరేకత కల్పిస్తున్నది. గత ప్రభుత్వంలో కారు పార్టీ నిర్ణయాల వలన ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి మరోసారి గులాబీ పార్టీని దెబ్బతీయాలని అధికార పార్టీ యోచిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.