తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరుస ఓటములను చవిచూసినా కేటీఆర్ ప్రవర్తనలో మార్పు రావడం లేదని ఆయన విమర్శించారు.
శుక్రవారం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ముత్తంగి మరియు జిన్నారంలో ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశాలు జరిగాయి. పటాన్చెరు కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జిన్నారం అధ్యక్షుడు వడ్డే కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అందుకే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని ఘోరంగా ఓడించారని మంత్రి గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను సున్నాకు పరిమితం చేసినా, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా కేటీఆర్కు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందుతున్న ఇందిరమ్మ ప్రజా పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అది ఓర్వలేకనే కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. ఈ అబద్ధపు ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు ప్రాంతంలోని ఐదు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని వివేక్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని, కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా, టికెట్ల కేటాయింపులో క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తామని, ‘గెలుపు గుర్రాలకే’ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. టికెట్ రాని నేతలు నిరాశ చెందవద్దని, వారికి పార్టీ పదవుల్లోనూ, ఇతర అభివృద్ధి పనుల్లోనూ తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
పటాన్చెరు పారిశ్రామికాభివృద్ధికి ఇందిరా గాంధీ వేసిన పునాదులే నేటి ప్రగతికి కారణమని మంత్రి పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఐదు నూతన మున్సిపాలిటీల ఏర్పాటుతో పాటు, ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ నిధులతో త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.
ALSO READ: Medaram: మేడారం జాతర.. ఆకాశ మార్గంలో అమ్మవారి దర్శనం, రూ.4,800కే హెలికాప్టర్ సేవలు