రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల ఆగడాలు శృతిమించాయని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మీద, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారిమీద ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం ఆ తర్వాత క్షమాపణలు కోరడం వారికి తంతుగా మారింది. మొన్నటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల మీద ఇష్టానుసారంగా అవినీతి ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ మీద సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ను డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని కేందమంత్రి కోరగా.. అందుకు బదులుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఓ వీడియోను విడుదల చేశారు.తంబాకులో డ్రగ్స్ కలుపుకుని సంజయ్ తీసుకుంటారని ఆ వీడియోలో ఆరోపించారు.
పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు విన్న బండి సంజయ్ అనుచరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంలో ఉన్నారని తెలుసుకుని కర్రలు, రాళ్లు తీసుకుని బయలుదేరారు. బండి అనుచరులు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందుగా భద్రత నడుమ కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి తరలించారు. పోలీసులను నెట్టుకుని వెళ్లిపోయిన బండి సంజయ్ అనుచరులు.. అక్కడే ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. అనంతరం గంగుల కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నేతలు వారికి అడ్డం తిరగగా.. వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం వారిని పోలీసులు వాహనంలో తరలించారు.
బీఆర్ఎస్ పార్టీలో అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి నిలిచారు. ఆయన మీద ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.గతంలో సీఎం రేవంత్ మీద, ఆ తర్వాత కరీంనగర్ కమిషనర్ మీద దురుసు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేంద్రమంత్రి బండి సంజయ్ మీద కూడా సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల విధులకు పలుమార్లు భంగం కలిగించినందుకు గాను ఆయన మీద కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీలోనూ ఆయన సీఎం పలుమార్లు హెచ్చరించారు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.అయినప్పటికీ పాడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. ఇష్టానుసారంగా ఎదుటి వ్యక్తులను కించపరచడం, వారి మీద ఆరోపణలు చేయడం ఆ తర్వాత కావాలనే ప్రభుత్వం తన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని మాట్లాడటం ఆయనకు పరిపాటిగా మారింది.
నగరంపై నేపాలీ ముఠాల కన్ను! జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య.. పనిమనుషుల విషయంలో జాగ్రత్త తప్పదా?
బీఆర్ఎస్ హయాం నుంచే డ్రగ్స్ కేసు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఇదే అంశంపై బీజేపీ సైతం పలుమార్లు ప్రస్తావించింది. కేటీఆర్ గతంలో డ్రగ్స్ తీసుకున్నారని, నాడు సీఎంగా కేసీఆర్ ఉండటంతో ఆయనతో పాటు పలువురు పెద్దలు తప్పించుకున్నారని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తూ వస్తున్నది. కేటీఆర్ సైతం తాను డ్రగ్స్ తీసుకోలేదని కుండబద్దలు గొట్టారు. కానీ, ఈ పార్టీలు మాత్రం ఆయన డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని పట్టుబడుతున్నాయి. తాను టెస్టుకు సిద్ధమని గతంలో కేటీఆర్ ప్రకటించారు. కానీ, ఇంతవరకు చేయించుకోలేదు.ఈ క్రమంలోనే సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్, బీజేపీ డ్రగ్స్ విషయంలో కేటీఆర్ను విమర్శిస్తుంటాయి. తాజాగా ఇదే అంశంపై పాడి కౌశిక్ జోక్యంతో ఈ వ్యవహారం కాస్త మరింత హీటెక్కింది. తాజాగా ఘటనతో అయినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు వస్తుందా? రాదా? అనేది తెలియాల్సి ఉన్నది.