కిందపడ్డా పైచేయి మాదే అనడంలో కేటీఆర్ దిట్ట. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవం తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చారు. ఎన్నికల్లో అక్రమాలు జరగడం వల్లే కాంగ్రెస్ గెలిచిందంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ తేదీ వరకు ఎన్నో రకాల అక్రమాలు జరిగాయని, వాటన్నిటిపై చర్చ జరగాలన్నారు. అయితే ఫైనల్ గా ప్రజా తీర్పుని శిరోధార్యంగా భావిస్తున్నామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ పాత్ర సమర్థంగా పోషించామని చెప్పారు కేటీఆర్.
LIVE: BRS Working President @KTRBRS addressing the media at Telangana Bhavan https://t.co/Rnd7KCSuLL
— BRS Party (@BRSparty) November 14, 2025
2028లో మనమే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా కేటీఆర్ ఇదే రకమైన స్టేట్ మెంట్లిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపిస్తే 2028లో కేసీఆర్ సీఎంగా వస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూడా ఆయన అదే డైలాగ్ చెప్పడం విశేషం. 2028లో కచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. ఈ ఉప ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ బలం తగ్గిపోలేదని గోడకేసి కొట్టిన బంతిలాగా బలంగా తిరిగొస్తామన్నారు. కేసీఆర్ తిరిగి సీఎం అయ్యే వరకు కష్టపడతామన్నారు. ఉప ఎన్నికల్లో గెలవకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవచ్చని అన్నారు కేటీఆర్. 2014 నుంచి 2023 వరకు 7 ఉప ఎన్నికలు వస్తే ఒక్కదాంట్లో కూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ గెలవలేదని గుర్తు చేశారు. అయినా 2023లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. అదే ఊపులో ఇప్పుడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకపోయినా 2028లో మాత్రం విజయం బీఆర్ఎస్ దేనని చెప్పుకొచ్చారు కేటీఆర్.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 నుంచి 2023 వరకు మొత్తం ఏడు ఉప ఎన్నికలు జరిగాయి. పాలేరు, నారాయణ్ ఖేడ్, హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం 5చోట్ల గెలిచింది. మిగతా రెండు చోట్ల ఓడిపోయింది. అయితే ఆ రెండు చోట్ల కూడా గెలవని కాంగ్రెస్, చివరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు తెచ్చుకోలేని కాంగ్రెస్ 2023లో గెలిచిందని గుర్తు చేశారు కేటీఆర్. అలాగే వచ్చే ఎన్నికలనాటికి బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుంటుందన్నారు.
ఆత్మ విమర్శ..
ఈ ఉప ఎన్నికల ఫలితం కేటీఆర్ లో పశ్చాత్తాపం తెచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఓటమితో ఆత్మవిమర్శ చేసుకుంటామని చెప్పారు కేటీఆర్. అయితే ఓటమితో నిరాశ చెందడంలేదని, ప్రజల తరపున గొంతెత్తడంలో ప్రతిపక్షంగా బ్రహ్మాండమైన పాత్ర పోషించామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలం అయ్యామన్నారు. పార్టీ కార్యకర్తలు, గులాబీ కుటుంబ సభ్యులు నిరాశ చెందొద్దని, బాధ పడాల్సిన అవసరం లేదన్నారు.
ప్రధాన ప్రతిపక్షం మనమే..
ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా కేటీఆర్ మాత్రం ఒక విషయంలో సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ ని మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించారన్నారు. బీజేపీ లెక్కలోకి కూడా రాలేదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ని మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు కేటీఆర్.
Also Read: జూబ్లీ హిల్స్ గుణపాఠం.. కేటీఆర్ ఇకనైనా గ్రౌండ్ రియాల్టీ అర్థం చేసుకుంటారా?
Also Read: రేవంత్ నాయకత్వానికి ఢోకా లేనట్టే