Car driver attacks RTC driver: రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, వల్లంపట్ల గ్రామం వద్ద నవంబర్ 19(బుధవారం) నాడు ఒక కారు డ్రైవర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేశాడు. రోడ్డు చిన్నగా ఉండటం వల్ల కారుకు దారి ఇవ్వలేదన్న కోపంతో కారు యజమాని బస్సును వెంబడించి, బస్సులోకి ఎక్కి డ్రైవర్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. ‘‘విధుల్లో నిబద్దతతో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగిపై ఉద్దేశ్యపూర్వకంగా దాడిచేయడం హేయమైన చర్య. ప్రజల రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తోన్న మా ఆర్టీసీ సోదరులపై దాడులను ఉపేక్షించము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ ఉద్యోగులకు నా పూర్తి మద్దతు, మనోధైర్య ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీని ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
వివరాళ్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఇల్లంతకుంట నుండి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి వచ్చిన కారు ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించింది. అయితే వల్లంపట్ల గ్రామ సమీపంలో రోడ్డు ఇరుగ్గా ఉండటం, ఎదురుగా వాహనాలు వస్తుండటంతో డ్రైవర్ బాలరాజు కారుకు సైడ్ ఇవ్వలేకపోయాడు. దీనికి కోపం పెంచుకున్న కారు డ్రైవర్ శ్రీకాంత్, బస్సును వెంబడించి ముందుకు వెళ్లి బస్సును అడ్డగించాడు. అనంతరం బస్సులోకి ఎక్కి, డ్రైవర్ సీట్లో ఉన్న బాలరాజును కాళ్లతో తంతూ, పిడిగుద్దులతో దాడి చేశాడు. “సైడ్ ఎందుకు ఇవ్వలేదు?” అంటూ బూతులు తిడుతూ రెచ్చిపోయాడు.
బస్సులో ఉన్న ప్రయాణికులు, కండక్టర్ వెంటనే స్పందించారు. డ్రైవర్కు మద్దతుగా నిలిచి, దాడి చేస్తున్న వ్యక్తిని అడ్డుకున్నారు. “సైడ్ ఇవ్వకపోతే కొడతావా? నీ తండ్రి వయసున్న వ్యక్తిపై చేయి చేసుకుంటావా?” అని నిలదీశారు. బాధితుడైన డ్రైవర్ బాలరాజు ఫిర్యాదు మేరకు ఇల్లంతకుంట పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు కఠిన సెక్షన్ల కింద కేసు పెట్టారు.
Read Also: Bus Accident: ట్యాంకర్ ఢీ కొన్న జగన్ బస్సు.. నిద్రలో 40 మంది..