తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణలో తలెత్తుతున్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ కమిటీలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (KRMB & GRMB) ఛైర్మన్లతో పాటు.. జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA) చీఫ్ ఇంజనీర్, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్లను సభ్యులుగా నియమించారు. సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలను సూచించడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం.
ముఖ్యంగా, ఈ కమిటీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు కూడా ప్రాధాన్యత కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుండి నలుగురు, తెలంగాణ నుండి నలుగురు ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. దీనివల్ల రాష్ట్రాల వాదనలను నేరుగా కమిటీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించనుంది.
ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద నీటి వినియోగం, విద్యుత్ ఉత్పత్తి, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలకు ముగింపు పలకడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ALSO READ: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని బూతులమయం చేశారు.. హరీష్ రావు ఫైర్