తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్న తీరు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆయన మండిపడ్డారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశానికి ప్రభుత్వం తరపున ప్రతినిధులు గంటన్నర ఆలస్యంగా రావడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సభలో ప్రధాన ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, మైకులు కట్ చేస్తూ గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీని బూతులమయం చేశారని హరీష్ రావు ఆరోపించారు. ‘అసెంబ్లీని గాంధీ భవన్ లాగా, సీఎల్పీ మీటింగ్ లాగా మార్చేశారు. మూసీ కంపు కంటే సీఎం నోటి నుంచి వచ్చే మాటల కంపు ఎక్కువగా ఉంది’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా స్ట్రీట్ రౌడీలా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆయనొక ద్రోహి అని మండిపడ్డారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రధాని మోడీని విమర్శించినప్పుడు లేని తప్పు, తాను సీఎం గురించి మాట్లాడితే ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు.
అవినీతి ఆరోపణలు, బహిష్కరణ
రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని.. ప్రతి పనిలోనూ కమీషన్లు వసూలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ వంటి గౌరవప్రదమైన నాయకుడిని ఇష్టం వచ్చినట్లు దూషించడం రేవంత్ రెడ్డి అహంకారానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.
స్పీకర్ వైఖరి కూడా ఏకపక్షంగా ఉందన్న ఆయన ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ప్రభుత్వ నిరంకుశ పోకడలకు నిరసనగా ఈ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. కేవలం విమర్శలకే పరిమితమైన ఈ సభలో ఉండటం అర్థరహితమని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ: Telangana Assembly: విపక్షాలను చెడుగుడు ఆడేసిన సీఎం రేవంత్రెడ్డి.. 20 నిమిషాలపాటు మాస్ ర్యాగింగ్