MP Chamala Kiran Kumar: కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ కలిసే పాలన సాగిస్తున్నారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కాపురం చేశాయని, ఆ రెండు పార్టీల సహకారం వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని చామల ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భారీ దోపిడీని ఆనాడు బండి సంజయ్ గానీ, కిషన్ రెడ్డి గానీ ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దోచుకున్న సొమ్ములో బీజేపీకి కూడా వాటా ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎంపీ చామల ఎండగట్టారు. ఈ కేసులో గవర్నర్ వంద రోజుల తర్వాత కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చారని, కానీ ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై ఛార్జ్ షీట్ దాఖలు కాకుండా బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. అరవింద్ కుమార్పై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీ (DoPT)కి లేఖ రాసినా, కేంద్రంలోని బీజేపీ పెద్దలు అనుమతి రాకుండా ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్ అధికారిపై విచారణను అడ్డుకోవడం ద్వారా పరోక్షంగా కేటీఆర్ను రక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
బండి సంజయ్ చిల్లర మాటలు మానుకోవాలని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఐఏఎస్ అరవింద్ కుమార్పై విచారణ జరిపేలా డీవోపీటీని ఒప్పించాలని చామల సవాల్ విసిరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన 8 సీట్లు ఏ పార్టీ ఓట్లతో వచ్చాయో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓట్లు ఎటు మళ్లాయో ప్రజలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కేటీఆర్కు బీజేపీ మద్దతు ఇస్తున్న విషయం అందరికీ అర్థమవుతోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: Top 20 News Today: KTR పై కేసు.. స్పందించిన హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలపై అద్దంకి ఫైర్