Ameenpur Lake: అమీన్ పూర్ చెరువును అన్ని రకాలుగా అభివృద్ది చేసేలా వెంటనే ప్రతిపాదనలను సిద్దం చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె అమీన్పూర్ సర్కిల్లో విస్తృత స్థాయి పర్యటించారు. చెరువు పరిరక్షణ, పారిశుద్ధ్య మెరుగుదల, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఆమె పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమీన్పూర్ చెరువులో విస్తరించిన గుర్రపు డెక్క తొలగింపునకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటూ పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసే గుర్రపు డెక్క తొలగించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు ఆమెకు వివరించారు.
Also Read: Electric Air Taxi In India: ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ వచ్చేస్తోంది, హ్యాపీగా గాల్లో ఎగిరిపోవచ్చు!
చెరువు కట్ట వెంట వినోద, ప్రజా ఉపయోగ సదుపాయాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా ప్రజలకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అమీన్పూర్ పరిసర ప్రాంతంలో ఉన్న తాత్కాలిక చెత్త డంప్ యార్డు తక్షణమే తొలగించాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడంతో పాటు ఇకపై అక్కడ చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూరగాయల వ్యాపారులతో మాట్లాడిన కమిషనర్, ప్రతి వ్యాపారి తమ వద్దే చెత్త సంచులు ఏర్పాటు చేసుకుని వ్యర్థాలను వేరుగా సేకరించాలని సూచించారు. మార్కెట్ ముగిసిన అనంతరం సంచుల్లో సేకరించిన చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది తీసుకెళ్తారని ఆమె వారికి సూచించారు. పచ్చి వ్యర్థాలను కంపోస్టింగ్ చేయడం, కొబ్బరి చెక్కలను పునర్వినియోగం చేసి ఆదాయం పొందే మార్గాలను అనుసరించాలని వ్యాపారులకు సూచించారు. అమీన్పూర్ సర్కిల్లో సుస్థిర అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని కమిషనర్ సృజన ీ సందర్భంగా పిలుపునిచ్చారు.
అదనంగా, స్వచ్ఛ ఆటో టిప్పర్ల సంఖ్యను పెంచి ఇంటింటి చెత్త సేకరణను మరింత వేగవంతం చేయాలని మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా, స్వచ్ఛ ఆటోలకు మాత్రమే అప్పగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆయన సూచించారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణ, స్వచ్ఛ ఆటో వాహనాల ద్వారా చెత్త సేకరణ విధానం, వాటి అవసరాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రహదారుల రెండు వైపులా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని సూచించారు. అలాగే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను సమర్థవంతంగా తొలగించి, అక్కడ మళ్లీ చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాహ్నవి శశాంక్ లను చెత్త సేకరణపై వివరాలను అడిగి తెల్సుకున్నారు.
Also Read: KTR On Govt: గాల్లో దీపాలుగా విద్యార్థుల ప్రాణాలు.. రెండేళ్లలో 123 మంది మృతి.. కేటీఆర్ ధ్వజం