Badvel TDP: టీడీపీ ఆవిర్బావం నుంచి సైకిల్ పార్టీ కంచుకోటగా ఉన్న కడపజిల్లా బద్వేల్ నియోజకవర్గంలో 2004 ఎన్నికల నాటి నుంచి పసుపు దళం ఉనికి కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. రెండు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గం లో వరుస ఓటములు తెలుగు తమ్ముళ్లను తీవ్ర గందరగోళంలోకి నెడుతున్నాయి.. 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి సత్తచాటినా బద్వేల్లో మాత్రం నాయకత్వ లోపం వల్లే ఓటమి పాలయింది. అందుకే ఇప్పుడు నాయకత్వ మార్పు పై జరుగుతున్న ప్రచారంతో టీడీపీ ఇన్చార్జ్ వర్గంలో అలజడి మొదలైందట.. ఇంతకీ బద్వేల్ నియోజకవర్గం టీడీపీలో ఏం జరుగుతోంది? బద్వేల్ ఉమ్మడి కడప జిల్లాలోని తెలుగుదేశం ఒకప్పుడు కంచుకోట లాంటి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆ నియోజకవర్గాన్ని శాసించారు టీడీపీ దివంగత నేత బిజివేముల వీరారెడ్డి. టీడీపీ ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిచిన వీరారెడ్డి ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు మూడు క్యాబినెట్లలో మంత్రిగా పని చేశారు. జిల్లాలో దివంగత సీఎం వైఎస్ హవా కొనసాగించినా బద్వేల్లో మాత్రం అన్నీ వీరారెడ్డి కనుసైగలతోనే నడిచేవి.
1999 ఎన్నికల్లో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బిజివేముల వీరారెడ్డి మరణించడంతో 2001లో బద్వేల్కు ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజకీయ వారసురాలిగా కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ బైపోల్స్లో విజయం సాధించారు. 2001 ఉపఎన్నికల్లో గెలిచిన గెలుపే బద్వేల్లో టీడీపీది ఆఖరిదిగా మిగిలిపోయింది. 2004లో పోటీ చేసిన విజయమ్మ ఓటమిపాలయ్యారు. అయినా వీరారెడ్డిపై గౌరవంతో టీడీపీ అధిష్టానం బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్గా బాధ్యతలు కట్టబెట్టింది. 2009 ఎన్నికల నాటికి బద్వేల్ ఎస్సీ నియోజకవర్గంగా మారినా అక్కడ వీరారెడ్డి కుటుంబమే టీడీపీ బాధ్యతలు చూస్తూ వస్తోంది. విజయమ్మ తర్వాత ఆమె కుమారుడు రితీష్ రెడ్డి ఆ ఎస్సీ నియోజకవర్గం ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. రెండు దశాబ్దాలుగా ఆ కుటుంబసభ్యులు నియోజకవర్గం ఇన్చార్జ్ పదవిలో ఉన్నా, గత నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడంతో. ఇప్పుడు నియోజకవర్గం ఇన్చార్జ్ పదవిని ప్రస్తుత డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డికి అప్పగిస్తున్నారనే ప్రచారం రితీష్రెడ్డి వర్గీయుల్లో టెన్షన్ పుట్టిస్తోందంట.
అసలే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తమ పదవికి ఎసరు వస్తుందనే భయంతో రితీష్ అండ్ కో అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గుంతోటి వెంకటసుబ్బయ్య 2021లో అకస్మాత్తుగా మరణించడంతో… ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధ బైపోల్స్లో మొదటిసారి గెలిచారు. ఆ ఎన్నికల్లో మృతి చెందిన వారి స్థానంలో వారి కుటుంబసభ్యలు పోటీ చేస్తే.. పోటీకి దూరంగా ఉండాలన్న సంప్రదాయాన్ని పాటించి టీడీపీ బరిలోకి దిగలేదు. అయితే అప్పట్లో టీడీపీతో విభేదిస్తున్న బీజేపీ ఉప ఎన్నికల్లో అభ్యర్ధిని బరిలో దింపి దారుణంగా ఓడిపోయింది. 2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా బీజేపీ పట్టుబట్టి బద్దేల్ నుంచి పోటీ చేసి టీడీపీ మద్దతుతో అంతోఇంతో పోటీ ఇవ్వగలిగింది. అయితే ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 7 టీడీపీ గెలుపొందినా.. బద్వేల్ మాత్రం వైసిపి వశమైంది. ఆ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ క్యాండెట్ దాసరి సుధ చేతిలో బీజేపీ అధ్యర్ధి బొజ్జా రోషన్న ఓడిపోయారు.
ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న బొజ్జా రోషన్నకు కమలం కండువా కప్పించి గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న రితీష్ రెడ్డి.. గెలుపు కోసం గట్టిగా కృషి చేయలేదనే టాక్ టీడీపీలోనే వినిపిస్తోంది.రితీష్ అందర్నీ కలుపుకుని పోవడంలో విఫలమయ్యారని, అందుకే ఓటమి పాలయ్యామని అప్పట్లోనే అధిష్టానానికి బద్వేల్ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బద్వేల్ కు చెందిన కాంట్రాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి డిసిసిబి చైర్మన్ పదవి దక్కడంతో, ఆయన బద్వేల్ ఇన్చార్జ్ పదవిపై కన్నేసి రితీష్ రెడ్డి వ్యతిరేక వర్గాన్ని తన వైపుకు తిప్పుకోవడంతో, బద్వేల్ టీడీపీ క్యాడర్ మొత్తం సూర్యనారాయణ రెడ్డికే జై కొడుతోందంట.
ఇలాంటి పరిస్థితుల్లో బద్వేల్ ఇన్చార్జ్ విషయంలో అధిష్టానం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కార్యకర్తల అభిప్రాయం సేకరించడంతో సూర్యనారాయణ రెడ్డి, రితీష్ రెడ్డి వర్గాల మద్య వార్ మొదలైందట. ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్బంగా బద్వేల్ లో సూర్యనారాయణ రెడ్డి, రితీష్ రెడ్డి వర్గాలు పోటా పోటీగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి, వేర్వేరుగా ఎన్టీఆర్ జయంతి నిర్వహించడం వారి ఆధిపత్యపోరును మరింత రచ్చకెక్కించింది. ప్రస్తుతం రెండు వర్గాలు విజయవాడలో మకాం వేసి నారా లోకేష్ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాయంట.నాలుగు దశాబ్దాల పాటు పార్టీ కోసం కష్టపడిన వీరారెడ్డి కుటుంబాన్ని కాదని ఇతరులకు ఇన్చార్జ్ పదవి ఎలా ఇస్తారని రితీష్ వర్గం వాదిస్తోందంట. మరోవైపు తాతల పేర్లు చెప్పుకుని ఎంత కాలం మనుగడ సాధిస్తారని, గత నాలుగు ఎన్నికల్లో వారి హయాంలో టీడీపీ గెలవలేకపోవడంతో నాయకత్వ మార్పు తప్పదని సుర్యనారాయణ వర్గం అంటోంది. మరి టీడీపీ అధిష్టానం బద్వేల్ ఇన్చార్జ్ విషయంలో ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అనేది అక్కడి తమ్ముళ్లలో హాట్ టాపిక్ అయింది.
Story By Apparao Big Tv
Also Read: NTPC: ఎన్టీపీసీలో భారీగా ఉద్యోగాలు.. రూ.1,40,000 జీతం, దరఖాస్తు చేసుకున్నారా..?