మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించడంపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవిత తన ప్రసంగంలో అమ్మగా పాలన అందిస్తానని, ప్రజల కడుపులు చూసి పాలిస్తానని చెప్పడంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత పదేళ్లు (2014-2023) అధికారంలో ఉన్నప్పుడు కేవలం తమ కుటుంబ జేబులు నింపుకోవడమే ధ్యేయంగా పాలించారని, ఆ విషయాన్ని ఇప్పుడు కవిత పరోక్షంగా అంగీకరించినట్లయిందని ఎద్దేవా చేశారు.
కుటుంబ పాలనలో ప్రజా సమస్యలు గుర్తురాలేదా?
తెలంగాణ జాగృతి ద్వారా ప్రజలను చైతన్యం చేస్తానని గతంలో చెప్పిన కవిత, అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రజల కష్టాలు ఎందుకు పట్టించుకోలేదని చామల ప్రశ్నించారు. విద్యా, వైద్యం, నిరుద్యోగం వంటి అంశాలు కేవలం అధికారం కోల్పోయాకే గుర్తుకు వచ్చాయా అని నిలదీశారు. తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రం నుండి అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కల్వకుంట్ల కుటుంబానిదేనని విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు తెలంగాణను దోచుకుంటూ, ఇప్పుడు పంపకాల్లో తేడాలు రావడంతోనే కొత్త పార్టీ నాటకాలకు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై విషప్రచారం వద్దు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కర్కోటకుడు, హిట్లర్ అని విమర్శించడంపై చామల మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే 22 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, గ్రూప్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో పేపర్ లీకేజీలతో యువత భవిష్యత్తును నాశనం చేశారని, ఇప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కవితకు లేదన్నారు.
ముఖ్యమంత్రి పీఠంపై కవిత వ్యామోహం
నాడు కేసీఆర్ ఉద్యమ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేశారని, ఇప్పుడు కవిత వస్తూనే తనను తాను ‘ముఖ్యమంత్రి’ అని పిలిపించుకోవడంలోనే ఆమె అధికార దాహం అర్థమవుతోందని చామల విమర్శించారు. ‘కవిత గారూ.. మీరు తెల్లకాగితం కాదు, మీ పదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో మచ్చలను చూశారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, గతంలో చెప్పిన పిట్టకథలను మళ్లీ నమ్మే స్థితిలో ఎవరూ లేరని హితవు పలికారు. ప్రజల కోసం పోరాటం చేయాలంటే గతాన్ని కూడా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
ALSO READ: తెలంగాణలో కీలక పరిణామం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. కోదండరాం, మంత్రి అజారుద్దీన్!