CM Revanth Reddy: ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తహసిల్దార్ కార్యాలయాల్లోనే వీటిని పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారం, కమిటీ గుర్తించిన అంశాలపై శనివారం సచివాలయంలో చర్చించారు. మార్చి మొదటి వారంలోగా 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని రెవెనూ్య శాఖను ఆదేశించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలన్నారు.
2020 ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటి తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేవలం 3 నెలల్లోనే సమగ్ర భూసర్వే చేసిందన్నారు. హడావుడిగా చేయడం వల్లే కొత్త చిక్కులు వచ్చాయని కమిటి తెలిపిందన్నారు. పోర్టల్ లో లోపాలు సవరించాలంటే చట్టం సవరణ , కొత్త ఆర్వోఆర్ చట్టం చేయాలన్నారు. వివాదాలు లేకుండా భూ రికార్డుల ప్రక్షాళన చేయాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. కమిటీ తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నారు. వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Read More: తెలంగాణ ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తుంది.. పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు
ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ కు ఆదేశించారు. పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. గోప్యంగా ఉండాల్సిన లక్షలాది రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, భూ రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఎలా పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డేటా భద్రంగా ఉన్నట్లేనా..? రికార్డులను విదేశీ కంపెనీలకు ఇచ్చే నిబంధనలున్నాయా అని ప్రశ్నించారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ మారితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని సీఎం పేర్కొన్నారు.