Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కాగజ్నగర్ క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభ అత్యంత విజయవంతమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం పూర్తిగా కిక్కిరిసిపోయింది. స్థలం సరిపోకపోవడంతో వేలాది మంది రోడ్లపైనే నిలబడి సీఎం ప్రసంగాన్ని విన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు.
గుడిసె రహిత గిరిజన గూడాలు
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా తాము అధికారంలోకి వస్తామని చెప్పిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పాలమూరు జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఆదిలాబాద్ జిల్లాకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. 60 ఏళ్లుగా ఈ జిల్లాకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజనుల సొంతింటి కలను నెరవేర్చేందుకు 100 శాతం ఇళ్లు ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ చేపడతామని, ఏడాది తిరిగేలోపు జిల్లాలో ఒక్క ఆదివాసీ కూడా గుడిసెలో ఉండకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు ఆపలేదని, సెప్టెంబర్ 17న మరో లక్ష ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. అలాగే ఈ సభ వేదికగా జిల్లాకు మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై అల్టిమేటం
గత పాలకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీరందించే తుమ్మిడిహట్టి బ్యారేజీని పక్కనబెట్టి, కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ వద్ద నిర్మించి లక్ష కోట్లు గోదావరి పాలు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఇంకా స్పందన రాలేదన్నారు. నదీ జలాల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రధాని చెబుతున్నా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాత్రం సహకరించడం లేదని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి వద్ద 2 వేల ఎకరాల ముంపు భూమిని ఇచ్చేలా చర్చలు జరపడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దూతగా వ్యవహరించాలని, మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉప్పెనలా కదులుతారని హెచ్చరించారు.
పంటల కొనుగోలుపై కేంద్రానికి డెడ్లైన్
రాష్ట్రంలో 75 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న, జొన్న పంటలను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటిని కేంద్రం సేకరించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకైనా, పంటల కొనుగోళ్లకైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి సహకరించాలని, లేనిపక్షంలో ఆయన రాష్ట్రంలో తిరగలేరని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి జూన్ 15 వరకు డెడ్లైన్ విధిస్తున్నామని, ఆ తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తడిచిన ధాన్యాన్ని సైతం గిట్టుబాటు ధరకే కొంటామని, ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Also Read: పవన్ కళ్యాణ్పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!